ఇక ఇంటింటికీ ఇంటర్నెట్‌

ABN , First Publish Date - 2020-12-15T07:55:11+05:30 IST

ఇక ఇంటింటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం అందనుంది. 2022 నాటికి రాష్ట్రంలోని 33 జిల్లాలు, 585 మండలాలు, 12,751 గ్రామ పంచాయతీల్లోని 83.5 లక్షల

ఇక ఇంటింటికీ ఇంటర్నెట్‌

‘టీ-ఫైబర్‌’కు ‘రైట్‌ ఆఫ్‌ వే’ అనుమతి

2022 నాటికి ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ప్రాజెక్టు పూర్తి

పీవోపీలకు భవనాలు ఇవ్వాలి.. ఐటీ శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్‌, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఇక ఇంటింటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం అందనుంది. 2022 నాటికి రాష్ట్రంలోని 33 జిల్లాలు, 585 మండలాలు, 12,751 గ్రామ పంచాయతీల్లోని 83.5 లక్షల గృహాలకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.2000 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు’కు ఆటంకాలు తొలగించే చర్యలు చేపట్టింది.


‘ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌(ఓఎ్‌ఫసీ)’ కోసం భూసంబంధిత ఇబ్బందులు తలెత్తకుండా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సోమవారం ‘రైట్‌ ఆఫ్‌ వే’ ఉత్తర్వులు జారీ చేశారు. టెండర్లు పూర్తి చేసి కేబుల్‌ వేసే బాధ్యతను ఎల్‌ అండ్‌ టీ, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌, ఈసీఐఎల్‌కు ప్రభుత్వం అప్పగించింది. కేబుల్‌ను భూగర్భం(అండర్‌గ్రౌండ్‌)లో, స్తంభా ల ద్వారా(ఏరియల్‌) వేస్తారు. రాష్ట్ర హెడ్‌క్వార్టర్‌ నుంచి జిల్లాలకు, మండలాలకు, గ్రామ పంచాయతీలకు, గ్రామాలు, వ్యక్తిగత గృహాలు, ఇంతర ఎంటర్‌ ప్రైజె్‌సకు, ప్రభుత్వ కార్యాలయాలకు కేబుల్‌ వేస్తారు.

ఈ ప్రాజెక్టు మానిటరింగ్‌, ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ కోసం ‘నెట్‌వర్క్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌(ఎన్‌వోసీ)’ను ఏర్పాటు చేశారు. పీఎల్‌బీ హెచ్‌డీఎ్‌ఫఈ(హై డెన్సిటీ పాలిఇథైలిన్‌) పైపుల ద్వారా ఓఎ్‌ఫసీని 38 వేల కిలో మీటర్ల పొడవున వేస్తారు. 18వేల కిలోమీటర్ల మేర కేబుల్‌ను భగీరథ పైపులైను గుండా వేస్తున్నారు. మిగిలిన 20వేల కిలోమీటర్ల కేబుల్‌ను తొలిదశలో స్టేట్‌ హెడ్‌క్వార్టర్‌ నుంచి మండలాలు,  పంచాయతీలకు వేయనున్నారు.


ఫైబర్‌ గ్రిడ్‌ రెండో దశ కింద 50వేల కిలో మీటర్ల కేబుల్‌ను గ్రామ పంచాయతీల నుంచి గృహాలకు వేస్తారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రైట్‌ ఆఫ్‌ వే అధికారాలు క ల్పించింది. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే కేబుల్‌ వేసే వెసులుబాటును కార్పొరేషన్‌కు రైట్‌ ఆఫ్‌ వే కింద ప్రభుత్వం కల్పించింది. టీ-ఫైబర్‌ సంస్థ ఏర్పాటు చేసే ‘పాయింట్‌ ఆఫ్‌ ప్రెసెన్స్‌(పీవోపీ)ల కు ప్రభుత్వ కార్యాలయాలు స్థలాన్ని ఉచితంగా కేటాయించాలని ఆదేశించింది. 


Updated Date - 2020-12-15T07:55:11+05:30 IST