ఉస్మానియాలో సిబ్బంది అయోమయం.. నిలదీసిన యువతి!

ABN , First Publish Date - 2020-06-22T15:59:27+05:30 IST

ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం వివాదాస్పదమవుతోంది. ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో బతికి ఉన్న మహిళా చనిపోయిందంటూ

ఉస్మానియాలో సిబ్బంది అయోమయం.. నిలదీసిన యువతి!

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల తాజా నిర్వాకం వివాదాస్పదమవుతోంది. ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో బతికి ఉన్న మహిళ చనిపోయిందంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఒకే వయసులో ఉన్న ఇద్దరు మహిళలు ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు. ఇద్దరి పేర్లు కూడా ఒకటే కావడంతో ఆసుపత్రి సిబ్బంది అయోమయానికి గురయ్యారు. ఉన్నిసా అనే పేరుతో మహిళలిద్దరూ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అందులో ఒకరికి కరోనా పాజిటివ్ కాగా, మరొకరు శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ మృతి చెందింది. కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ కుటుంబ సభ్యులకు కాకుండా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళ కుటుంబ సభ్యులకు ఉస్మానియా సిబ్బంది మరియు రెయిన్ బజార్ పోలీసులు ఫోన్ చేసి ఆమె చనిపోయినట్టు చెప్పారు. దీంతో చికిత్స పొందుతున్న ‘‘మా అమ్మ ఎలా చనిపోతుంది’’ అంటూ కుమార్తె నిలదీసింది. ఖంగుతిన్న ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది, రెయిన్ బజార్ పోలీసులు నోరెళ్లబెట్టారు. రెయిన్ బజార్ పోలీసులు మరియు ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చారని, అలాగే తీవ్ర మానసిక వేదనకు గురిచేశారంటూ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇద్దరికీ ఒకే రకమైన పేర్లు ఉండటంతో ఆసుపత్రి సిబ్బంది ఆయామోయానికి గురై ఉంటారని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2020-06-22T15:59:27+05:30 IST