నేటి నుంచి బియ్యం పంపిణీ!
ABN , First Publish Date - 2020-04-01T08:33:46+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో తెల్లరేషన్ కార్డుదారులకు బుధవారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో మొత్తం 87.54 లక్షల రేషన్కార్డులకు

లబ్ధిదారునికి 12 కిలోలు.. రాష్ట్రంలో 87.54లక్షల కార్డులు
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ నేపథ్యంలో తెల్లరేషన్ కార్డుదారులకు బుధవారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో మొత్తం 87.54 లక్షల రేషన్కార్డులకు సంబంధించి 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. వీరిలో ఒక్కొక్కరికీ 12 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తారు. లబ్ధిదారులు ఒక్కసారిగా రేషన్ దుకాణాలకు వచ్చి, భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించకుండా ఉండేందుకు.. వారికి కూపన్లు ఇచ్చి, అందులో పేర్కొన్న సమయంలోనే రేషన్ దుకాణానికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు. బియ్యం పంపిణీ పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.
మానవతకు మారుపేరు కేసీఆర్: గంగుల
ఎక్కడ లేనివిధంగా 12 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడం ద్వారా సీఎం కేసీఆర్ మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం ఆయన పౌరసరఫరాల భవన్లో ‘ఉచిత బియ్యం’పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు భౌతిక దూరం పాటించేలా డీలర్లు చర్యలు తీసుకోవాలని, రేషన్ దుకాణాల వద్ద శానిటైజర్లు, సబ్బు, నీళ్లను అందుబాటులో పెట్టాలని ఆదేశించారు.