ధనాధన్ ధరణి
ABN , First Publish Date - 2020-11-03T10:08:26+05:30 IST
కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ప్రభుత్వం తహసీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అధికారాలను కల్పించింది. గత నెల 29న సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. శంషాబాద్ తహసీల్దార్
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు షురూ
అరగంటలో రిజిస్ర్టేషన్, మ్యుటేషన్ పూర్తి
ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 70 రిజిస్ట్రేషన్లు
కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు
మ్యుటేషన్ పత్రాల ప్రింట్కు ఇబ్బందులు
స్వయంగా పరిశీలించిన కలెక్టర్లు, ఆర్డీవోలు
ప్రక్రియ సులభంగా ఉందంటున్న రైతులు
ఆంధ్రజ్యోతి, హన్మకొండ :
కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ప్రభుత్వం తహసీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అధికారాలను కల్పించింది. గత నెల 29న సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి సేవలను లాంఛనంగా ప్రారంభించారు. మొదటి రోజు అక్కడక్కడా సాంకేతిక సమస్యలు తలెత్తినా మొత్తం మీద రిజిస్ర్టేషన్ల ప్రక్రియ విజయవంతంగా జరిగింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాగానే మ్యుటేషన్ల కూడా వెంటనే చేశారు. అయితే మ్యుటేషన్ పత్రాలను ప్రింట్ తీయడంలో కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్నిచోట్ల సర్వర్ స్లోగా ఉండడంతో రిజిస్ట్రేషన్కు ఎక్కువ సమయం పట్టింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికావడానికి అన్ని చోట్ల గరిష్టంగా 30 నుంచి 40 నిమిషాలు పట్టింది. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ వ్యక్తిగతంగా చేసుకోదలిచిన వారు ఇంటర్నెట్లో ధరణి పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేసుకుంటున్నారు. అలా చేయలేనివారు మీ సేవ కేంద్రాలకు వెళ్లి రూ.200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకుంటున్నారు.
మొదటి రోజు 70
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి రోజు 70 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 10, వరంగల్ రూరల్లో 30, మహబూబాబాద్లో 10, జనగామలో 11, జయశంకర్భూపాలపల్లి జిల్లాలో 9 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ములుగు జిల్లాలో సాంకేతిక సమస్యలతో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. 1/70 అమలులో ఉన్న ఏజెన్సీ మండలాల్లో రిజిస్ట్రేషన్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు.
వరంగల్ అర్బన్ జిల్లాలో సోమవారం 9 మండలాల్లో 15 మంది రైతులు తమ భూముల క్రయవిక్రయాల కోసం స్లాట్ బుక్ చేసుకున్నా రు. వీటిలో 10 రిజిస్ట్రేషన్ అయ్యా యి. రెండు మండలాల్లో ఒక్క స్లాట్ కూడా బుక్ కాలేదు. భీమదేవరపల్లిలో 1, ధర్మసాగర్లో2, ఎల్కతుర్తిలో 2, హ న్మకొండలో 2, హసన్పర్తిలో 1, ఐనవోలు లో 1, కాజీపేటలో 3, ఖిలా వరంగల్లో 2, వేలేరులో 1 స్లాట్ బుక్ అయింది. కమలాపూర్, వరంగల్ మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ఒక్క స్లాట్ కూడా బుక్ కాలేదు. అయితే ధర్మసాగర్లో 1, ఎల్కతుర్తిలో 2, హన్మకొండలో 1, ఐనవోలు 1, కాజీపేటలో 3, ఖిలా వరంగల్లో 2 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మ్యుటేషన్లను వెంటనే చేశారు. 7 రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉన్నాయి. స్లాట్ బుక్ చేసుకున్న కొనుగోలు, అమ్మకందారులు ఇద్దరు సంబంధిత పత్రాలను తీసుకొని కార్యాలయానికి రాగానే వీటికి కూడా రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తారు. ఈ భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలు తర్వాత తపాలా ద్వారా ఇంటికే వస్తాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ధరణి పోర్టల్ సేవలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 11 మండలాల్లో తొలి రోజు 9 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాగా మల్హర్లో తొలుత సైట్ కొంత ఆలస్యంగా తెరుచుకుంది. స్లాట్ బుకింగ్ జరిగిన మండలాల్లో సాంకేతిక లోపం వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది.
వరంగల్ రూరల్ జిల్లాలోని 16 మండలాల్లో పదింటిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు 30 రిజిస్ట్రేషన్లు కాగా వాటిలో 5 గిఫ్టు రిజిస్ర్టేషన్లు అయ్యాయి. రూరల్ కలెక్టర్ హరిత నెక్కొండలో భూ రిజిస్ట్రేషన్ల తీరును పరిశీలించారు. సాంకేతిక సమస్యలు తలెత్తలేదు.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ధరణి సేవలు మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 10 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాటిని తొలగించిన తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సాంకేతిక సమస్యలతో కురవి మండలంలో సాయంత్రం 4 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగలేదు. గూడూరు మండలంలో 12 మంది స్లాట్ బుక్ చేసుకోగా ఒక్క రైతుకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది.
జనగామ జిల్లాలోని 12 మండలాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. మొత్తం 11 రిజిస్ట్రేషన్ల జరిగాయి. సర్వర్ స్లోగా ఉండడంతో ఒక్కో రిజిస్ట్రేషన్కు అరగంట సమయం పట్టింది. రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ మ్యుటేషన్ పత్రాల ప్రింట్ రాలేదు.
ములుగు జిల్లాలోని 9 మండలాలకు ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో నాలుగు స్లాట్ బుకింగ్లు జరిగాయి. సాంకేతిక సమస్య వల్ల వీటిలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. బయోమెట్రిక్ మిషన్లో వేలిముద్ర వేస్తే మిస్ మ్యాచ్ అని వచ్చింది. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఏజెన్సీ 1/70 చట్టం అమలులో ఉన్నందువల్ల భూముల రిజిస్ట్రేషన్ కోసం ఎవరూ స్లాట్ బుక్ చేసుకోలేదు.
అధికారుల పరిశీలన
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు హసన్పర్తి తహసీల్దార్ కార్యాలయంలో ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. హసన్పర్తి మండలం రేపాకపల్లెకు చెందిన అడిగొప్పుల మల్లేశం కుమారుడు వీరస్వామికి చెందిన 1.03 ఎకరాల భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఎల్కతుర్తి మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీవో స్వయంగా సందర్శించి ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించారు.
ఈ కార్యాలయంలో ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామాలకు చెందిన ఒక గిఫ్ట్ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ జరిగాయి. ఐనవోలు తహసీల్దార్ కార్యాలయంలో వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు గోకె కల్పన 10 గుంట వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వెంటనే మ్యుటేషన్ కూడా చేశారు. వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాల్లో కూడా కలెక్టర్లు ధరణి రిజిస్ట్రేషన్లను పరిశీలించారు.