రాష్ట్రంలో... మొక్కజొన్నకు పెరిగిన డిమాండ్...
ABN , First Publish Date - 2020-07-14T20:59:35+05:30 IST
కరోనా భయంలో... ఈ సంవత్సరం రైతులు మొక్కజొన్న పంటను తగ్గించిన విషయం తెలిసిందే. అయితే... దిగుబడి బాగానే వచ్చింది. మార్కెట్లో డిమాండ్ కూడా బాగుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం వ్యవసాయపరంగా జాతీయ స్థాయిలో పేరొందిన గ్రామం. ఈ గ్రామ రైతులు నిత్యం కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూంటారు. వీరి స్ఫూర్తితో... పలువురు రైతులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వ్యవసాయంలో మెళకువలు తెలుకుంటున్నారు.
![రాష్ట్రంలో... మొక్కజొన్నకు పెరిగిన డిమాండ్...](https://media.andhrajyothy.com/appimg/galleries/2020071403250657/07142020152911n76.jpg)
హైదరాబాద్ : కరోనా భయంలో... ఈ సంవత్సరం రైతులు మొక్కజొన్న పంటను తగ్గించిన విషయం తెలిసిందే. అయితే... దిగుబడి బాగానే వచ్చింది. మార్కెట్లో డిమాండ్ కూడా బాగుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం వ్యవసాయపరంగా జాతీయ స్థాయిలో పేరొందిన గ్రామం. ఈ గ్రామ రైతులు నిత్యం కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూంటారు. వీరి స్ఫూర్తితో... పలువురు రైతులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వ్యవసాయంలో మెళకువలు తెలుకుంటున్నారు.
ఇక... ఆర్మూర్ డివిజన్లో మొక్కజొన్న పంటను ఎక్కువగా సాగుచేస్తారు. అయితే... గత సంవత్సరం 38 వేల ఎకరాల్లో సాగుచేస్తే, ఈ సంవత్సరం 13 వేల ఎకరాల్లో మాత్రమే సాగుచేశారు. ప్రభుత్వం ఆంక్షలు, కరోనా ప్రభావం కారణంగా మొక్కజొన్న పంట సాగును రైతులు తగ్గించారు. ఈ క్రమంలో... మొక్కజొన్న పచ్చి బుట్టకు డిమాండ్ పెరిగింది. అంకాపూర్లోని 63 వ జాతీయ రహదారి పక్కన పచ్చి మొక్క బుట్టల మార్కెట్ను ఐదు దశాబ్దాల కిందట ఏర్పాటు చేశారు.
ఇక్కడ ప్రతి సంవత్సరం రూ. 50 కోట్లకు పైగా పచ్చి బుట్ట వ్యాపారం జరుగుతుంది. సీజన్లో ప్రత్యక్షంగా వందల మందికి, పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుంది. వివిధ జిల్లాలకు చెందిన వ్యాపారులు కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యాపారం చేస్తున్నారు. మొక్కజొన్న పంట విస్తీర్ణం బాగా తగ్గడంతో పచ్చి బుట్టకు డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నా... కరోనా ప్రభావంపై మార్కెట్ ధరలు ఆధారపడి ఉంటాయని భావిస్తున్నారు.
జూలై మొదటి వారంలో ప్రారంభమైన మొక్కజొన్న అమ్మకాలు... అక్టోబర్ మూడో వారం వరకు దాదాపు మూడున్నర నెలల పాటు కొనసాగుతాయి. చుట్టుపక్కల గ్రామాల్లో పండించిన మొక్కజొన్నను ఇక్కడికి తెస్తారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఇక్కడికొచ్చి పెద్ద మొత్తంలో కొంటారు. చుట్టుపక్కల గ్రామాల్లో పండించిన మొక్కజొన్నను ఇక్కడికి తెస్తారు.
మొక్కజొన్న బుట్టకు మంచి ధర లభిస్తుంది. వెయ్యి నుంచి 13 వందలకు పైగా కంకులు ఉండే ఆటో ట్రాలీకి రూ. 7వేల నుంచి రూ. 8 వేలవరకు ధర పలుకుతుంది. రైతులు ప్రస్తుతం ఒక మొక్కజొన్నను రూ. 5 నుంచి రూ.7 కు అమ్ముతున్నారు. వ్యాపారులు దాన్ని రూ.10 కు అమ్ముతున్నారు. కాల్చిన వాటిని రూ.15 కు అమ్ముతున్నారు. లారీలు, వ్యాన్లలో తీసుకెళ్లి హైదరాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, గోదావరిఖని, కోరుట్ల, మెట్ పల్లి, నిజామాబాద్, మహారాష్ట్రలోని చంద్రాపూర్, నాందేడ్, నాగపూర్, కిన్వర్ట్ వంటి ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు.