ప్రముఖుల భద్రతపై ‘డేగకన్ను’..!
ABN , First Publish Date - 2020-08-01T07:41:19+05:30 IST
తెలంగాణలో పర్యటించే ప్రముఖుల భద్రపై పోలీసులు ఇకపై ‘డేగకన్ను’ వేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘గరుడ స్క్వాడ్’ను రంగంలోకి దింపనున్నారు. డేగలకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించనున్నారు. ప్రముఖుల పర్యటనల సమయంలో నిషేధిత ప్రాంతంలో డ్రోన్లు ఉంటే గుర్తించి

హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పర్యటించే ప్రముఖుల భద్రపై పోలీసులు ఇకపై ‘డేగకన్ను’ వేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘గరుడ స్క్వాడ్’ను రంగంలోకి దింపనున్నారు. డేగలకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించనున్నారు. ప్రముఖుల పర్యటనల సమయంలో నిషేధిత ప్రాంతంలో డ్రోన్లు ఉంటే గుర్తించి, వాటిని ధ్వంసం చేసేలా ఈ స్క్వాడ్లకు శిక్షణ ఇస్తారు. డేగలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఇద్దరిని నియమిస్తారు. దేశంలో ఇప్పటివరకు ఆర్మీ మాత్రమే ఈ గరుడ స్క్వాడ్ను ఉపయోగిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో ఉపయోగించనున్నారు. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో ఈ స్క్వాడ్కు శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు హోంశాఖ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపంగా.. వాటిని ప్రభుత్వం ఆమోదించింది. ఇద్దరు నిపుణుల్ని కాంట్రాక్ట్ పద్దతిలో నియమించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకరికి రూ. 35 వేలు, మరొకరికి రూ. 25 వేలు నెలవారీ గౌరవ వేతనం చెల్లించనున్నారు.
మావోయిస్టుల కదలికలే కారణమా..
తెలంగాణపై మావోయిస్టులు తిరిగి పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి సంబంధించిన యాక్షన్ టీమ్లు ఇప్పటికే రంగంలోకి దింగాయనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో.. సీఎం సహా రాష్ర్టానికి వచ్చే వీఐపీలు, వీవీఐపీల పర్యటనల సందర్భంగా భద్రతా పరంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే.. గరుడ స్క్వాడ్ను సిద్దం చేస్తున్నట్లు సమాచారం.