రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు...
ABN , First Publish Date - 2020-11-06T14:25:04+05:30 IST
ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా... సైబర్ నేరగాళ్లు మాత్రం ఏదో రకంగా రెచ్చిపోతూనే ఉన్నారు. ఊహించని రీతిలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. సైబర్ క్రిమినల్స్ పంజాలో మరో ఇద్దరు నగరవాసులు చిక్కారు. లోన్ నిమిత్తం జస్ట్ డయల్ ద్వారా సమాచారం...
హైదరాబాద్ : ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా... సైబర్ నేరగాళ్లు మాత్రం ఏదో రకంగా రెచ్చిపోతూనే ఉన్నారు. ఊహించని రీతిలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. సైబర్ క్రిమినల్స్ పంజాలో మరో ఇద్దరు నగరవాసులు చిక్కారు. లోన్ నిమిత్తం జస్ట్ డయల్ ద్వారా సమాచారం తీసుకోగా.. అదే జస్ట్ డయల్ పేరు చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ.18లక్షలు కాజేశారు. నగరానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తికి జస్ట్ డయల్ నుంచి చేస్తున్నామని రాహుల్ అనే వ్యక్తి కాల్ చేశాడు. పీఎం ఎంప్లాయ్మెంట్ స్కీం కింద లోన్ ఇప్పిస్తానని ఆశ చూపాడు, జీఎస్టీ, ప్రాసెసింగ్, ఇతరత్రా పలు రకాలుగా చార్జీలు ఉంటాయని దఫాలుగా రూ. 18లక్షలు నగదు బదిలీ చేయించుకున్నాడు. లోన్ రాకపోవడంతో పాటు ఎవరూ స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో కేసులో...
ఇన్స్టాగ్రామ్లో ఓ మహిళతో స్నేహం చేసిన సైబర్ నేరగాడు రూ. 3లక్షలు కాజేశాడు. తొలుత ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత స్నేహం మాటున డాలర్లు, విలువైన గిఫ్టులు పంపిస్తామని నమ్మించాడు. రెండు రోజుల తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫోన్ చేసినట్లు నటించి మీకు... గిఫ్ట్ వచ్చింది, కరెన్సీ వచ్చాయని ఆమెకు ఫోన్ చేశారు. కస్టమ్స్, ఇతర చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని.. వెంటనే రూ. 3లక్షలు చెల్లించాలని చెప్పడంతో ఆమె వారికి రూ.3లక్షలు ఆన్లైన్లో బదిలీ చేసింది. మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.