వ్యాపారులకు టోపీ..పైసా లేకుండా షాపింగ్?
ABN , First Publish Date - 2020-12-11T08:56:45+05:30 IST
ఇదో కొత్తరకం మోసం..! టార్గెట్ రద్దీగా బిజినెస్ సాగే వ్యాపార కేంద్రాలు..! వాటిల్లో క్యాష్కౌంటర్ల దగ్గర ఉండే సిబ్బంది..!
యూపీఐ పేరుతో టోకరా.. నకిలీ ఎస్సెమ్మె్సలతో మోసాలు
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఇదో కొత్తరకం మోసం..! టార్గెట్ రద్దీగా బిజినెస్ సాగే వ్యాపార కేంద్రాలు..! వాటిల్లో క్యాష్కౌంటర్ల దగ్గర ఉండే సిబ్బంది..! ఎక్కడా దొరకకుండా సైబర్ నేరగాళ్లు ఆఫ్లైన్లో చేస్తున్న మోసమిది..! సైబర్ క్రైమ్ పోలీసులు ఈ తరహా మోసాలపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆఫ్లైన్లో మోసం ఎలా చేస్తారంటే.. మోసగాళ్లు రెండు మూడు బ్యాచుల్లో రద్దీ దుకాణాలను, షాపింగ్ మాల్స్ను ఎంచుకుంటారు.
ఒకరు ఇంటిదగ్గరే కూర్చుని, కంప్యూటర్ ముందు బల్క్ ఎస్ఎంఎస్ యాప్తో సిద్ధంగా ఉంటాడు. మిగతా బ్యాచ్లు దుకాణంలో సరుకులు, బట్టులు, ఇతరత్రా షాపింగ్లో బిజీగా ఉంటాయి. వీరి మధ్య ఫోన్ కనెక్షన్ యాక్టివ్గా ఉంటూ.. వారు ఉన్న చోట ఏంజరుగుతుందో వింటూ ఉంటారు. షాపింగ్ అయిపోయాక.. డిజిటల్ పేమెంట్ ద్వారా బిల్లు చెల్లింపులు చేస్తామంటారు. తమ మిత్రుడు డబ్బులు బదిలీ చేస్తారని, గూగుల్పే లేదా ఇతర పేమెంట్ యాప్ల మొబైల్ నంబరు చెప్పాలని కోరుతారు.
ఆ వివరాలను ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చునే తమ గ్యాంగ్ మెంబర్కు చెబుతారు. అతడు డబ్బు పంపినట్లు బల్క్ ఎస్ఎంఎస్ పంపుతాడు. ఇందుకోసం వేర్వేరు యాప్స్ను వాడుతాడు. బ్యాంకు ఖాతా నుంచి నిర్ణీత మొత్తంలో నగదు బదిలీ అయినట్లు తమ వారికీ సందేశం పంపుతాడు.
తన మొబైల్లో బ్యాంకు నుంచి పంపినట్లుగానే సెండర్ డిటైల్స్ షార్ట్లింక్లో ఉండడం.. నగదు బదిలీ అయినట్లు మెసేజ్ రావడం.. దుకాణంలో కొనుగోలుదారుల రద్దీ ఉండడంతో.. వ్యాపారి పెద్దగా పట్టించుకోరు. ఆ తర్వాత తీరిగ్గా బ్యాంకు ఖాతా చూస్తేగానీ తాము మోసపోయిన విషయాన్ని గుర్తించలేరు. వ్యాపారులు ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.