పల్లె ప్రగతి తో సుందర గ్రామాలుగా మారుతున్నాయి- సీఎస్
ABN , First Publish Date - 2020-06-05T20:30:17+05:30 IST
తెలంగాణలో ప్రభుత్వం అమలు చేసిన పల్లె ప్రగతి, ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమాల ద్వారా గ్రామాల అవసరాలు తీరి సుందర గ్రామాలుగా మారుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం అమలు చేసిన పల్లె ప్రగతి, ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమాల ద్వారా గ్రామాల అవసరాలు తీరి సుందర గ్రామాలుగా మారుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన ఎస్ఎస్నగర్ మండలంలోని తిర్కన్పల్లి, కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామాలను ఆకస్మికంగా సందర్శించి పల్లె ప్రగతి , పారిశుద్ద్య కార్యక్రమాల అమలును తనిఖీ చేశారు. మొదటగా తిర్కన్పల్లి గ్రామంలో మిషన్ భగీరధ నల్లాలను పరిశీలించారు. కనెక్షన్ పైప్లకు తప్పని సరిగా నల్లాలను ఏర్పాటు చేయాలని లేకపోతే జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.
రోజూ ఎంత సేపు మంచినీరు వస్తుందన్న విషయాన్ని సర్పంచ్ బాలరెడ్డి , గ్రామ పంచాయితీ సెక్రటరీ నరేష్ను అడిగి తెలుసుకున్నారు. రోడ్లను పరిశీలించారు. ఎలాంటి చెత్త, పిచ్చిమొక్కలు లేకండా రోడ్లను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయితీ ఆవరణలో ఉన్ననర్సరీని, రైతులు ఏ పంట వేయాలన్నది వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రామ సభ జరిగిందా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో మొక్కజొన్న పంటకు బదులుగా పత్తి, కంది , సోయాబీన్ వేస్తున్నట్టు ఏఈవో తెలిపారు. క్రాస్బుకింగ్యాడ్ను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ సర్వే నెంబర్లు గల రైతులు వేసే పంటలను నీర్ణీత ఫార్మాట్లో నమోదుచేసుకోవలని సీఎస్ సూచించారు.
కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామాన్నికూడా సీఎస్ సోమేశ్కుమార్ సందర్శించారు. తొలత మంకీఫుడ్కోర్టును పరిశీలించారు. గ్రామాలో 33 గ్రూపుల్లో 830 ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారని గ్రామ సర్పంచ్ రవితేజ సీఎస్ దృష్టికి తెచ్చారు. అనంతరం డంపింగ్యార్డు, కంపోస్ట్ షెడ్ను సీఎస్ పరిశీలించారు. కంపోస్ట్షెడ్లో బెడ్స్ ఇంకా పెంచాలని, కంపోస్ట్షెడ్లో పూర్తి శిక్షణనిచ్చిన వ్యక్తిని నియమించాలని సూచించారు. అనంతరం వైకుంఠధామాల పనులను పరిశీలించి అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఎస్ వెంటనే పలువురు సీనియర్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.