రహదారి భద్రత పై ఫ్రేమ్‌ వర్క్‌ను రూపొందించండి- సీఎస్‌

ABN , First Publish Date - 2020-12-19T21:11:58+05:30 IST

తెలంగాణలో రహదారి భద్రత పై ప్రతి జిల్లాకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికకు అవసరమైన ఫ్రేమ్‌ వర్క్‌ను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌

రహదారి భద్రత పై ఫ్రేమ్‌ వర్క్‌ను రూపొందించండి- సీఎస్‌

హైదరాబాద్‌: తెలంగాణలో రహదారి భద్రత పై ప్రతి జిల్లాకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికకు అవసరమైన ఫ్రేమ్‌ వర్క్‌ను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు గురువారం రహదారి భద్రతపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్యను తగ్గించడం, గోల్డెన్‌ అవర్స్‌లోపల వైద్య సేవలు అందించానికి అంబులెన్స్‌ సేవలు, ఆసుపత్రులు, ట్రామా కేర్‌ సెంటర్ల ద్వారా అవసరమైన వైద్యసేవలు అందించే నిమిత్తం రూపొందించిన యూనిఫైడ్‌ యాక్షన్‌ప్లాన్‌ను సీఎస్‌ సమీక్షించారు. 


ట్రామా కేర్‌ సెంటర్లలో పనిచేస్తున్న హెల్త్‌ వర్కర్లకు నిమ్స్‌ ఎమెర్జెన్సీ మెడిసిన్‌ ద్వారా శిక్షణను అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రమాదాల సందర్భంగా క్షతగాత్రుల మరణాల సంఖ్యను తగ్గించే నిమిత్తం ఈఎంఆర్‌ఐ ద్వారా అందించే ఆర్టీసీ బ్లీడిగ్‌ కంట్రోల్‌ పై మాస్టర్‌ శిక్షణ కోసం వైద్య శాఖ సిబ్బందిని గుర్తించాలన్నారు. ఓఆర్‌ఆర్‌లో ప్రమాదాల తగ్గింపునకు సంబంధించి ఫెన్సింగ్‌, క్రాసింగ్స్‌, సైనేజెస్‌, విద్యుద్దీకరణ, ప్రమాదాల ఎక్కువగా జరిగే ప్రాంతాలలో ఏ ఎన్‌పిఆర్‌ కెమెరాల ద్వారా  వేగ నియంత్రణ,పర్యవేక్షణ తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి ఒక బృందాన్నిఏర్పాటు చేయాలని సీఎస్‌ ఆదేశించారు. 


ప్రభుత్వ డ్రైవర్లకు సేఫ్‌ డ్రైవింగ్‌, వాహనాల మెయింటెనెన్స్‌ పై ఒక రోజు శిక్షణ అందించానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో రోడ్డు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, అడిషనల్‌ డీజీ జితేందర్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, సందీప్‌ శాండిల్య, రవాణాశాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు, తదితరులు పాల్గొన్నారు,

Updated Date - 2020-12-19T21:11:58+05:30 IST