నేరాలు తగ్గాయి.. కేసులు పెరిగాయి..
ABN , First Publish Date - 2020-12-30T05:20:05+05:30 IST
నేరాలు తగ్గాయి.. కేసులు పెరిగాయి..
తక్కువ సమయంలో నేరాల గుట్టు రట్టు
వరంగల్ ఇన్చార్జి సీపీ ప్రమోద్కుమార్
2020 వార్షిక నివేదిక వెల్లడి
వరంగల్ అర్బన్ క్రైం, డిసెంబరు 29: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గాయని, కేసుల సంఖ్య పెరిగిందని వరంగల్ ఇన్చార్జి పోలీసు కమిషనర్ పి. ప్రమోద్కుమార్ అన్నారు. వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో 2020 వార్షిక నివేదికను మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
2019లో 8,956 కేసులు నమోదుకాగా, 2020లో 9,663 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. డ్రంకెన్డ్రైవ్, ఈ-చలనా కేసులు ఎక్కువవడంతో కేసుల సంఖ్య పెరిగిందన్నారు. మొత్తంగా కేసుల సంఖ్య 7.8 శాతం పెరుగగా, నేరాల సంఖ్య 2.4శాతానికి తగ్గిందని చెప్పారు. ఇందులో హత్యలు 23.81 శాతం కాగా, దోపిడీలు 42.86, దొంగతనాలు 21 శాతం, మోసాలు 30 శాతం తగ్గాయని చెప్పారు. మహిళలపై దాడుల కేసులు 26 శాతం తగ్గాయన్నారు. కిందటేడు 1,050 రోడ్డు ప్రమాదాలు జరుగగా, ఈ యేడు 850 రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. ప్రమాదాల్లో 2019లో 369 మంది ప్రాణాలు కోల్పోగా, ఈ యేడు 330 మంది మరణించారన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ యేడు 8,515 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారన్నారు. ఈ చలనా ద్వారా 2019లో 2,97,817 కేసులు, 2020లో 6,25,428 కేసులు నమోదయ్యాయన్నారు.ఈ యేడు లోక్ అదాలత్లో 1,371 కేసులు రాజీ కుదరడంతో కేసులు కొట్టివేశామన్నారు.
సైబర్ క్రైం, ఐటీ కోర్ సేవలు భేష్
కమిషనరేట్ పరిఽధిలో జరిగిన నేరాలను ఛేదించడంలో సైబర్ క్రైం, ఐటీకోర్, సీసీఎస్, బ్లూకోల్ట్, పెట్రోకార్స్, లా అండ్ ఆర్డర్ సిబ్బంది నిబద్ధతతో పనిచేశారని సీపీ కొనియాడారు. గొర్రెకుంట, హన్మకొండ, హంటర్రోడ్డులో జరిగిన హత్యానేరాలతో పాటు పలు దొంగతనాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి యాప్స్ ద్వారా రుణాలు ఇచ్చి ఇబ్బందులకు గురిచేసే నేరస్తులను బెంగుళూరు నుంచి అరెస్టు చేశామన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేస్తున్న గుట్కాలు, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని వరంగల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకుని నేరస్తులను కటకటకాల వెనక్కి పంపించారన్నారు.
గొర్రెకుంటలో పది మందిని హత్యచేసిన సంజయ్కుమార్కు రెండు నెలల్లో ఉరిశిక్ష పడేవిధంగా ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి నేరస్తుడికి ఉరిశిక్ష పడేలా చేశామని సీపీ వెల్లడించారు. షీటీమ్స్, స్వశక్తి, జాగృతి బృందాలు అక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో విస్తృత సేవలందించారని కొనియాడారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టేది లేదని సీపీ ప్రమోద్కుమార్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీలు శ్రీనివా్సరెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, ఏసీపీలు జితేందర్రెడ్డి, శ్యాంసుందర్, శ్రీనివాస్, ప్రతాప్, ఫణీందర్, గిరిబాబుతో పాటు సీఐలు పాల్గొన్నారు.