దుర్భర భారతం.. నిర్భర భారత్ దిశగా సాగేనా?
ABN , First Publish Date - 2020-05-31T01:16:58+05:30 IST
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతోంది. లాక్డౌన్ సడలింపులు ఇచ్చే వరకూ సమస్తం అయిపోయిన విషయం తెలిసిందే...
![దుర్భర భారతం.. నిర్భర భారత్ దిశగా సాగేనా?](https://media.andhrajyothy.com/appimg/galleries/202005300743255/05302020194622n39.jpg)
హైదరాబాద్: కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. లాక్డౌన్ సడలింపులు ఇచ్చే వరకూ సమస్తం అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కొన్నింటికి సడలింపులు ఇచ్చారు. అయితే ‘‘కొత్తదనం ఉందా?.. పాతకు కొనసాగింపేనా?. భారత్ను బ్రాండ్ చేశారా?. హిందుత్వాన్ని ప్రమోట్ చేశారా?. దిగజారిన ఆర్థిక పరిస్థితికి ఏం సమాధానం చెప్పారు?. దుర్భర భారతం.. నిర్భర భారత్ దిశగా సాగేనా?. మోదీ మరో ఏడాది’’. అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్లో ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, ఆర్థిక విశ్లేషకులు ప్రసాద్, బీజేపీ నేత పాతూరి నాగభూషణం, విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు, ఆర్థికరంగ నిపుణులు డా.ప్రొ.జానయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నేత పాతూరి నాగభూషణం మాట్లాడుతూ ‘‘ఏడాదిలో మోదీ ఎన్నో సంస్కరణలు తెచ్చారు. భారత్ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. మోదీపై ఆరేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ అయినా వచ్చిందా?. గత ఏడాది ప్రతి దేశానికి జీడీపీ పడిపోయింది.’’ అని అన్నారు.
ఆర్థికరంగ నిపుణులు డాక్టర్ జానయ్య మాట్లాడుతూ 2019 సెప్టెంబర్ నుంచి దేశంలో ఆర్థిక మాంద్యం సూచనలు కనిపించాయన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించినప్పుడే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని వెల్లడించారు.
విశ్లేషకులు ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేయడం లేదు. డీమానిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాల నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. రోజువారీ లావాదేవీలు జరగకపోతే ఆర్థిక మాంద్యం ప్రభావం సామాన్యులపైనా పడుతుంది’’ అని చెప్పారు.
ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ‘‘ ప్యాకేజీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రత్యక్షంగా ప్రజలకు చేరింది పాయింట్ 9శాతం. వలస కూలీలను స్వస్థలాలకు చేర్చలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ దేశంలో ఏం జరిగినా ఇద్దరి కనుసన్నల్లో జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో పెడుతున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.