తుంబే ఆసుపత్రిపై చర్యలేం తీసుకున్నారు?

ABN , First Publish Date - 2020-07-08T08:42:17+05:30 IST

తుంబే ఆసుపత్రిపై చర్యలేం తీసుకున్నారు?

తుంబే ఆసుపత్రిపై చర్యలేం తీసుకున్నారు?

కొవిడ్‌ బిల్లు కోసం ప్రభుత్వ డాక్టర్‌ను 

నిర్బంధించడం తీవ్రమైన విషయం

ప్రభుత్వానికి, ఆస్పత్రికి నోటీసులు

14లోగా సమాధానమివ్వాలి: హైకోర్టు


హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): లక్షన్నర ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఫీవర్‌ ఆసుపత్రి డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌(డీఎంవో) డాక్టర్‌ సుల్తానాను నిర్బంధించిన తుంబే ఆసుపత్రి యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వ ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ను హైకోర్టు ఆదేశించింది. కొవిడ్‌ చికిత్స కోసం ఆమె ఇటీవల చాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రిలో చేరారు. ఒక్క రోజు చికిత్సకే భారీగా వేసిన బిల్లు చెల్లించలేదన్న కారణంతో ఆమెను అక్రమంగా నిర్బంధించినట్లు మీడియాలో వచ్చిన కథనాలను ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘ఇది తీవ్రమైన అంశం. కరోనా రోగులకు చికిత్స అందించే ఆసుపత్రులలో ఫీజు వసూలును నియంత్రిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మరోవైపు ఆసుపత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాల్సిందే’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ ఎలాంటి చర్యలు చేపట్టకపోతే... అందుకు తగిన కారణాలను ఈనెల 14లోగా కోర్టుకు చెప్పాలని పేర్కొంది. ఈమేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లకు, క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్లకు సంబంధించి జాతీయ, రాష్ట్ర మండళ్లతోపాటు పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చిన మెడికేర్‌, యశోద, సన్‌షైన్‌, కేర్‌ ఆసుపత్రులకు నోటీసులు జారీచేసింది. కరోనా చికిత్సకు చార్జీల వసూలులో ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది శ్రీకృష్ణ శర్మ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. కరోనా చికిత్స అందిస్తున్న ప్రైవేటు, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు వేస్తున్న బిల్లుల్లో పారదర్శకత ఉండేలా తగిన మార్గదర్శకాలు జారీచేయాలని ఆయన తన వ్యాజ్యంలో కోర్టును కోరారు. 

Updated Date - 2020-07-08T08:42:17+05:30 IST