ఐటీ ఉద్యోగికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-03-24T10:09:12+05:30 IST
విదేశాలకు వెళ్లి వచ్చిన ఐటీ కంపెనీ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది! తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ఆయన భార్య, కుమార్తెకు కూడా కరోనా

ఆయన భార్య, కుమార్తెకూ లక్షణాలు
గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు
ఇంట్లో మరో నలుగురు క్వారంటైన్
భూపాలపల్లి పట్టణంలో కలకలం
భూపాలపల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): విదేశాలకు వెళ్లి వచ్చిన ఐటీ కంపెనీ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది! తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ఆయన భార్య, కుమార్తెకు కూడా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. వారితో సన్నిహితంగా మెలగిన ఇతరులనూ క్వారంటైన్కు పంపాల్సి వచ్చింది. భూపాలపల్లిలో ఇప్పుడు ఈ ఘటన కలకలం రేపుతోంది. గోదావరిఖనికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కంపెనీ పనిలో భాగంగా ఈనెల 7న స్వీడన్ వెళ్లారు. ఈనెల 14న హైదరాబాద్కు తిరిగి వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆయనకు భార్య, ఆరేళ్ల కుమార్తె స్వాగతం పలికారు. ముగ్గురూ కలిసి ఇంటికి వెళ్లారు.
రెండు రోజుల తర్వాత అతనికి దగ్గు, జలుబు, జ్వరం రావటంతో గాంధీ ఆస్పత్రి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు. దాంతో, భర్తతోపాటు భార్య కూడా గాంధీ ఆస్పత్రిలో గడిపారు. ఆమెకు కూడా జ్వరం రావటంతో కూతురు, మనుమరాలిని తీసుకొని ఆమె తండ్రి భూపాలపల్లిలోని తన ఇంటికి వచ్చారు. జ్వరం తగ్గకపోవటంతో భూపాలపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. అక్కడ చికిత్స చేస్తున్న సమయంలోనే.. ఆమె కుమార్తెకూ జ్వరం, దగ్గు ప్రారంభమయ్యాయి. కాగా, ఆదివారం సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా పాజిటివ్గా రిపోర్టు రావటంతో ఆయనను గాంధీ ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స చేస్తున్నారు. ఇప్పుడు ఆయన భార్య, కుమార్తెను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ పరీక్షల అనంతరం సోమవారం గాంధీ ఆస్పత్రికి తరలించి, క్వారంటైన్లో ఉంచారు.
హోం క్వారంటైన్లో బంధువులు
సాఫ్ట్వేర్ ఉద్యోగికి పాజిటివ్ రావడం.. ఆయన భార్య, కుమార్తెకు కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంట్లోని మరో నలుగురిని హోం క్వారంటైన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఇక, వీరంతా వివిధ పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లడంతో ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.