తెలంగాణలో జనవరి నుంచి రేషన్ తీసుకోని వారికీ...
ABN , First Publish Date - 2020-05-24T07:54:44+05:30 IST
వరుసగా మూడు నెలలు (జనవరి, ఫిబ్రవరి, మార్చి) రేషన్ తీసుకోని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కరోనా ఆర్థిక సహాయాన్ని ....

- 2.08 లక్షల మందికి రూ.62.40 కోట్లు
- రూ.3 వేల చొప్పున ఖాతాల్లో జమ
- 5,187 టన్నుల కందిపప్పు పంపిణీ
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): వరుసగా మూడు నెలలు (జనవరి, ఫిబ్రవరి, మార్చి) రేషన్ తీసుకోని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కరోనా ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. 2.08 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే నెలలకు కలిపి రూ.3వేల చొప్పున మొత్తం రూ.62.40 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. కరోనా విపత్తు సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులున్న లబ్ధిదారులకు ప్యాకేజీ ప్రకటించిన విషయం విదితమే. ఒక్కో వ్యక్తికి 6 కిలోల బియ్యం, ఒక్క రేషన్ కార్డుపైన రూ.1,500 చొప్పున ఏప్రిల్, మే నెలలకు పంపిణీ చేసింది. ఏప్రిల్లో 74.07 లక్షలు, మే నెలలో 74.35 లక్షల కార్డుదారులకు రూ.2,227కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. బ్యాంకు ఖాతాలు లేని వారిని గుర్తించి ఏప్రిల్లో 5.21 లక్షలు, మే నెలలో 5.38 లక్షల మందికి రూ.158.24కోట్లు అందజేసింది.
అయితే, కరోనాకు ముందు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరుసగా రేషన్ బియ్యం తీసుకోని వారికి ఈ ఆర్థిక సాయం పంపిణీ చేయలేదు. దీంతో వారికి కూడా ఆర్థిక సహాయం పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ వ్యక్తం కాగా, ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఇదిలా ఉండగా ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి శనివారం నాటికి మే నెల కోటా కింద 81.49 లక్షల మంది కార్డుదారులకు 3.25 లక్షల టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ పంపిణీ చేసింది. ఒక్కో రేషన్ కార్డుకు కిలో చొప్పున 5,187 టన్నుల కందిపప్పును లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కష్ట కాలంలో పేదలకు ప్రభుత్వం అండగా నిలిచిందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివా్సరెడ్డి అన్నారు.