ఎంజీఎంను కొవిడ్ ఆస్పత్రిగా మారుస్తారా..?
ABN , First Publish Date - 2020-07-28T10:52:23+05:30 IST
వరంగల్లో సోమవారం ఒక్కరోజే 111 కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి
![ఎంజీఎంను కొవిడ్ ఆస్పత్రిగా మారుస్తారా..?](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
వరంగల్ అర్బన్, జూలై 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వరంగల్లో సోమవారం ఒక్కరోజే 111 కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రెండు వందల మంది కోసం ఎంజీఎంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డు సరిపోవడంలేదు. దీంతో పేద, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా కాకతీయ వైద్య కళాశాలలో దాదాపు పూర్తి కావచ్చిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రచురించింది. దీంతో ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు ఒక్కటై ఉద్యమ కార్యాచరణకు పూనుకుంటున్నాయి. ఇదే తరుణంలో మంగళవారం వరంగల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనైనా ఎంజీఎంను పూర్తి స్థాయి కొవిడ్ ఆస్పత్రిగా మార్చే నిర్ణయం తీసుకుంటారా...? కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వాడుకలోకి తీసుకువచ్చే నిర్ణయం తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.