లాక్‌ డౌన్‌కు సహకరించండి

ABN , First Publish Date - 2020-03-24T08:27:44+05:30 IST

కరోనా వైర్‌స(కొవిడ్‌-19)ను నివారణకు తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌

లాక్‌ డౌన్‌కు సహకరించండి

 అత్యవసరమైతేనే బయటకు రావాలి

 ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించొద్దు

 నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

జిల్లాలో 32 కరోనా అనుమానితులు

జిల్లా టోల్‌ ఫ్రీ నెం 08713-248080

కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌


భూపాలపల్లి కలెక్టరేట్‌, మార్చి 23 : కరోనా వైర్‌స(కొవిడ్‌-19)ను నివారణకు తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలు సహకరించాలని  కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ ద్వా రా కలెక్టర్‌ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మార్చి 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉందన్నారు.


లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున జిల్లా ప్రజలు ప్రభు త్వ నియమాలను తప్పక పాటించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ప్రజారవాణా వ్యవస్థ నిలిచిపోయిన కారణంగా అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ఇతర వాహనాలకు అనుమతి లేనందున రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వాహనాలకు అనుమతి లేదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇండ్లకే పరిమితం కావాలన్నారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తే సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలన్నారు.


కిరాణాలు, కూరగాయల దుకాణాలు, పాల షాపులకు మాత్రమే అనుమతి ఉందన్నారు. 1897 బ్రిటిష్‌ కాలం నాటి అంటు వ్యాధుల చట్టం, 2005 జాతీయ విపత్తు చట్టంకు విశేష అధికారాలు ఉన్నాయని, ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్‌, జిల్లా కార్యాలయాలు, డివిజన్‌, మండల కార్యాలయాలు తెరిచే ఉంటాయన్నారు. కార్యాలయాల్లో ఉద్యోగులు 30, 20 శాతాల్లో అందుబాటులో ఉంటారన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో మల్టీ ఏజెన్సీ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్‌ రూంలో అదనపు కలెక్టర్‌, ఆర్డీవో, అదనపు ఎస్పీ, డీఎంహెచ్‌వో, నలుగురు మెడికల్‌ ఆఫీసర్లు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. 


కరోనాపై టోల్‌ఫ్రీకి 08713- 248080 నెంబర్‌ను కేటాయించినట్లు తెలిపారు. ఈ నెంబర్‌కు కరోనా లక్షణాలు ఉన్నవారి వివరాలు, క్వారెంటైన్‌ వార్డుల్లో నుంచి బయటికి ఎవరైన వస్తే వారి వివరాలు తెలియజేయాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు భాధ్యతగా పోలీసులకు గానీ వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చి క్వారెంటైన్‌ వార్డులో ఉండాలన్నారు.


మార్చి, ఏప్రిల్‌ నెలలో ప్రసవానికి ఉన్న గర్భిణుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. నిత్యావసర వస్తువుల అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేషన్‌ సరుకులను ఒక ప్లాన్‌ ప్రకారం రేషన్‌ షాపులకు చేరవేస్తున్నట్లు పేర్కోన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 32 మంది క్వారెంటైన్‌ పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ నియమాలను పాటిస్తూ జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కాకుండా జిల్లా ప్రజలు భాధ్యతయుతంగా వ్యవహరించాలని కలెక్టర్‌ కోరారు.

Updated Date - 2020-03-24T08:27:44+05:30 IST