నేడు కాంగ్రెస్ మౌనదీక్ష
ABN , First Publish Date - 2020-06-26T07:55:23+05:30 IST
చైనా ఘాతుకానికి బలైన 20 మంది వీరజవాన్లను స్మరిస్తూ ‘అమర వీరులకు సలాం’ పేరుతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మౌనదీక్ష చేపట్టాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఏఐసీసీ
![నేడు కాంగ్రెస్ మౌనదీక్ష](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చైనా ఘాతుకానికి బలైన 20 మంది వీరజవాన్లను స్మరిస్తూ ‘అమర వీరులకు సలాం’ పేరుతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మౌనదీక్ష చేపట్టాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్సీ ఖుంటియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సీడబ్ల్యుసీ సమావేశ నిర్ణయాలను పార్టీ నేతలకు తెలిపేందుకు ఉత్తమ్ గురువారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో గాంధీ, ఇతర జాతీయ నేతల విగ్రహాల వద్ద ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ మౌన దీక్ష నిర్వహించాలని చెప్పారు. అనంతరం ‘చైనా.. భారత్ను వదిలిపో’ అంటూ సోషల్ మీడియాలో స్పీకప్ కార్యక్రమాలు చేయాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 29న కలెక్టరేట్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాయాల వద్ద, నియోజకవర్గ కేంద్రాల్లో రెండు గంటల పాటు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పార్టీ ముఖ్య నేతలు పొన్నం ప్రభాకర్, కుసుమ్కుమార్, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి, సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. కాగా.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను ఈ నెల 28న తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.