నిజాముద్దీన్ వెళ్లొచ్చిన వారు వివరాలివ్వండి.. లేకుంటే.. : విజయశాంతి
ABN , First Publish Date - 2020-04-01T03:02:42+05:30 IST
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదు సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు హాజరయ్యారు.
హైదరాబాద్ : ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదు సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు హాజరయ్యారు. వీరిలో చాలా మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఇప్పటి వరకూ గుర్తించిన వాళ్లే కాకుండా ఇంకా ఎవరెవరున్నారు..? వాళ్లు ఎవరెవర్ని కలిశారు..? అనే విషయాలపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలో నిజాముద్దీన్కు వెళ్ళొచ్చిన వారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి పలు సూచనలు చేశారు. మసీదు సమావేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వెంటనే తమ వివరాలను తక్షణమే స్వచ్ఛందంగా ప్రకటించాలని సూచించారు.
వివరాలతో ముందుకు రాని వారిని...
‘ సమస్య తీవ్రత మరియు కోట్లాది ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా, ఈ సమయంలో వివరాలతో ముందుకు రాని అందరినీ దేశద్రోహులుగా ప్రకటించి, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. వివరాలను స్వచ్ఛందంగా ప్రకటించినవారు ఈ దేశానికి నిజంగా ఎంతో మేలు చేసినవారవుతారు. యావత్ సమాజం పడుతున్న ఆందోళనను నివృత్తి చెయ్యటానికి గాను, వారికున్న అవకాశాన్ని ఇప్పటికైనా ఆ ప్రయాణీకులు ఉపయోగించుకుని ఏ విధమైన కుట్ర కోణంలోనూ తమ భాగస్వామ్యం లేదని నిరూపించుకోవాలి’ అని తన ఫేస్బుక్ వేదికగా విజయశాంతి పేర్కొన్నారు.