అనుమతులపై అయోమయం
ABN , First Publish Date - 2020-12-11T08:45:59+05:30 IST
ప్రైవేట్ జూనియర్ కాలేజీల అనుమతుల విషయంలో 8 నెలలుగా వివాదం కొనసాగుతూనే ఉంది. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో 435 కాలేజీల
435 ‘మిక్స్డ్’ కాలేజీల గుర్తింపు నిలుపుదల.. వీటిలో 1.60 లక్షల మంది విద్యార్థులు
ప్రభుత్వ నిర్ణయం కోసం ఇంటర్ బోర్డు ఎదురుచూపులు
రేపటితో ముగియనున్న ప్రవేశాలు
హైదరాబాద్, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ జూనియర్ కాలేజీల అనుమతుల విషయంలో 8 నెలలుగా వివాదం కొనసాగుతూనే ఉంది. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో 435 కాలేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రవేశాలకు ఈనెల 12 ఆఖరు తేదీ కావడంతో ఈ కాలేజీల్లో చేరిన 1.60 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఫైర్ ఎన్వోసీ నిర్ణయంపై వ్యతిరేకత
ప్రైవేటు జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి కాలేజీలు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) సమర్పించాలన్న నిర్ణయాన్ని కాలేజీల యాజమాన్యాల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. ఎట్టకేలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ ఏడాదికి మినహాయింపు ఇవ్వడంతో దాదాపు 60శాతం కాలేజీల సమస్య పరిష్కారమైంది. ప్రభుత్వ నిర్ణయంతో 843 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించింది.
కళాశాలల భవనంలో ఇతర వ్యాపార సంస్థలు ఉంటే వాటిని మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీ అంటారు. ఇలాంటి కాలేజీలు 435 ఉన్నాయి. ఈ కాలేజీలు ఫైర్ ఎన్వోసీ సమర్పించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. ఇంటర్ బోర్డు వీటికి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. అలాగే మరో 80 కాలేజీలు ఇతర జిల్లాలకు మారేందుకు పెట్టుకున్న దరఖాస్తులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి.
దీంతో మొత్తం 1358కాలేజీల్లో ఇంతవరకు అనుమతులు పొందినవి 843 ఉండగా.. 515 కాలేజీలు ప్రభుత్వ నిర్ణయం కోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్నాయి. 435 మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీల్లో దాదాపు 1.60 లక్షల సీట్లున్నాయి. ఇందులో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 80వేలకుపైగా ఉన్నారు. ఈ కాలేజీల్లో ఇప్పటికే మొదటి సంవత్సరం ప్రవేశాలు పూర్తయ్యాయి. మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులను కలుపుకుంటే దాదాపు 1.60లక్షల మంది ఉంటారు.
రేపటి వరకే ప్రవేశాలు
మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువు ఈనెల 2తో ముగియగా.. దీనిని పొడిగిస్తూ ఈనెల 12వరకు ఇంటర్ బోర్డు అవకాశమిచ్చింది. ఇదే ఆఖరు గడువని, ఇక పొడిగింపులు ఉండవని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ స్పష్టం చేశారు.