నష్టపరిహారం చెల్లించాల్సిందే
ABN , First Publish Date - 2020-12-28T08:11:58+05:30 IST
కిష్టరాయన్పల్లి రిజర్వాయర్ భూ నిర్వాసితులు నిరసనకు దిగారు. తమకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించతలపెట్టిన కిష్టరాయన్పల్లి రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం లక్ష్మణపురం గ్రామానికి చెందిన
ఆ తర్వాతే పనులు ప్రారంభించాలి
‘కిష్టరాయన్పల్లి’ భూనిర్వాసితుల డిమాండ్
రిజర్వాయర్ నిర్మాణ పనుల అడ్డగింత
300 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో ఘటన
నాంపల్లి, డిసెంబరు 27: కిష్టరాయన్పల్లి రిజర్వాయర్ భూ నిర్వాసితులు నిరసనకు దిగారు. తమకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించతలపెట్టిన కిష్టరాయన్పల్లి రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం లక్ష్మణపురం గ్రామానికి చెందిన నిర్వాసితులు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం నిర్మాణ పనులను అడ్డుకున్నారు.
కాంట్రాక్టర్ రిజర్వాయర్ పనులు ప్రారంభించడానికి రెండు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలను నిర్వాసితులు అడ్డుకుంటుండడంతో పోలీసులు అక్కడ మోహరించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం 300 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించడంతో అక్కడ కూడా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందిస్తామన్న ప్రభుత్వం తమను పట్టించుకోలేదని ఆరోపించారు. నష్టపరిహారం అందలేదని గతంలో తాము పనులను అడ్డుకోగా, అప్పటి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సమస్యను పరిష్కరిస్తానని ఇచ్చిన హామీ నెరవేరలేదని తెలిపారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, మిగిలి ఉన్న సుమారు 100 ఎకరాలకు భూపరిహారం, 174 కుటుంబాలకు పునరావాసం కల్పించిన తర్వాతే పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇద్దరు యువకులు పోలీ్సస్టేషన్లోని టవర్ ఎక్కారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో టవర్ దిగారు.