సింగరేణికి గండం!

ABN , First Publish Date - 2020-06-22T09:24:07+05:30 IST

తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణికి గండం దాపురించింది. బొగ్గు వెలికితీతలో దశాబ్దాల అనుభవం ఉన్న సంస్థ కిందకు నీళ్లు ..

సింగరేణికి గండం!

కేంద్ర నిర్ణయంతో పొంచి ఉన్న ప్రమాదం

బొగ్గు గనులు ప్రైవేట్‌ పరమైతే కష్ట కాలమే

పోటీని తట్టుకుని బొగ్గు విక్రయించడం సవాలే

సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం


హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణికి గండం దాపురించింది. బొగ్గు వెలికితీతలో దశాబ్దాల అనుభవం ఉన్న సంస్థ కిందకు నీళ్లు చేరుతున్నాయి. దేశంలో బొగ్గు తవ్వకాలను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలన్న కేంద్ర నిర్ణయంతో సింగరేణి గుత్తాధిపత్యానికి గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం సింగరేణి తప్ప మరే సంస్థ బొగ్గు తవ్వేందుకు వీల్లేదు. కానీ, రానున్న రోజుల్లో సింగరేణి పరిధిలోని గనులను కూడా ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే అవకాశాలు లేకపోలేదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉంది.


తెలంగాణలో గోదావరి తీరం వెంట 10వేల మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. సింగరేణి పరిధిలో 17 ఓపెన్‌కాస్టులు, 27 అండర్‌ గ్రౌండ్‌లు(యూజీలు) ఉండగా, 47 వేల మంది కార్మికులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. ఏటా 62 మిలియన్‌ టన్నుల బొగ్గును సంస్థ వెలికితీస్తోంది. మొత్తం బొగ్గులో 85శాతం థర్మల్‌ కేంద్రాలకు, మిగతా 15 శాతం సిమెంట్‌ కంపెనీలకు అమ్ముతోంది. థర్మల్‌ విద్యుత్తు సంస్థలకు ఇచ్చే బొగ్గు గ్రేడ్‌ను బట్టి రూ.2600-4000 వరకూ ఉండగా, సిమెంట్‌ కంపెనీలకు అమ్మే బొగ్గు రూ.3500దాకా ఉంటుంది. 


కొనకున్నా ఏం చేయలేం?

థర్మల్‌ విద్యుత్తు ప్లాంటు నుంచి కరెంట్‌ కొనుగోలు చేయాలంటే 25 ఏళ్లపాటు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం(పీపీఏ) చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కాలంలో కరెంట్‌ కొనుగోలు చేయకుంటే... స్థిర చార్జీలను విధిగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే బొగ్గు విషయంలో అలాంటి ఒప్పందాలేమీ ఉండవు. ఆయా సంస్థలు బొగ్గు కొనకపోతే ఏం చేయలేం. పలు థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు ధర తక్కువగా ఉన్నప్పుడు విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటాయి. ఇక, తెలంగాణలోనే బొగ్గు గనులను ప్రైవేట్‌ సంస్థలు చేజిక్కించుకుంటే... ధర టన్ను రూ.2వేలలోపే ఉండే అవకాశాలు ఉంటాయని సమాచారం.


సింగరేణి బొగ్గు ధర టన్ను రూ.2600 ఉంటే... అందులో 65శాతం (రూ.1495) కార్మికులు, ఉద్యోగులు, అధికారుల వేతనాలకే ఖర్చవుతుంది. సింగరేణిలో సగటున ఒక్కో కార్మికుడి వేతనం రూ.65వేలపైనే ఉండటం గమనార్హం. అదే ప్రైవేట్‌ సంస్థలు బొగ్గు తవ్వకాలు చేపడితే కార్మికులకు రూ.30వేలు మించి వేతనం ఇచ్చే అవకాశం ఉండదు. ఫలితంగా తక్కువ ధరకే బొగ్గు దొరుకుతుంది. ఆ పోటీని తట్టుకుని బొగ్గును విక్రయించడం సింగరేణికి పెద్ద సవాల్‌గా మారనుంది. కొనుగోళ్లు పడిపోతే... సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 50 గనులను కేంద్రం వేలం వేసింది. ఈ మేరకు రానున్న రోజుల్లో సింగరేణి కొత్తగా మైనింగ్‌ చేయాలంటే వేలంలో పాల్గొనక తప్పని పరిస్థితి నెలకొంది. 


కేంద్ర, రాష్ట్రాలకు పన్నులు కడుతున్నా..

ఐదేళ్ల కిందట రూ.11,928కోట్లుగా ఉన్న సింగరేణి టర్నోవర్‌... ప్రస్తుతం రూ.25,687కోట్లకు చేరింది. 2013-14 నుంచి 2018-19 వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.27,467 కోట్లను పన్నుల రూపేణా చెల్లించింది. ఇందులో వివిధ పన్నుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.13,105కోట్లు, డివిడెంట్‌, సీజీఎస్టీ, సర్వీస్‌ ట్యాక్స్‌, కస్టమ్స్‌ డ్యూటీ ట్యాక్స్‌, స్వచ్ఛభారత్‌ సెస్‌, కృషి కల్యాణ్‌ సెస్‌, జీఎస్టీ కాంపెన్సేషన్‌ సెస్‌, క్లీన్‌ ఎనర్జీ సెస్‌ కింద కేంద్ర ప్రభుత్వానికి రూ.14,362కోట్లు కట్టింది. అంతేకాదు.. సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాల అభివృద్ధికి జిల్లా మినరల్‌ ఫండ్‌ ట్రస్ట్‌ కింద మూడేళ్లలో రూ.1,844 కోట్లను అందించింది.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు కడుతూనే.. ఇటు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతోంది. రానున్న రోజుల్లో సింగరేణికి పోటీగా ప్రైవేట్‌ సంస్థలు వస్తే కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2 నుంచి మూడు రోజుల పాటు సమ్మె చేపట్టేందుకు జాతీయ కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ సమ్మెతో గనుల వాణిజ్యకీకరణ ఆగే అవకాశాలేమీ కనిపించడం లేదు.

Updated Date - 2020-06-22T09:24:07+05:30 IST