‘పోతిరెడ్డిని ఆపండి.. లేదంటే...’

ABN , First Publish Date - 2020-10-07T14:38:25+05:30 IST

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షత జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు

‘పోతిరెడ్డిని ఆపండి.. లేదంటే...’

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షత జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడానికి ఏపీ ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకే ఏ అనుమతులూ లేవని, అలాంటిది దాని సామర్థ్యం పెంచడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి ఏపీ సీఎం జగన్‌.. ‘‘అనుమతులు లేకుండానే గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులు చేపడుతున్నారు. సీతారామ ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులకు అనుమతులు లేవు. మాకో న్యాయం వాళ్లకో (తెలంగాణకు) న్యాయమా? తెలంగాణకు ఏ నిబంధన వర్తిస్తుందో మాకూ అదే వర్తిస్తుంది’’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.


దీనికి కేసీఆర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ ఉన్నాయని, ఆ ప్రాజెక్టు నది బేసిన్‌లో ఉందని, కానీ రాయలసీమ ప్రాజెక్టు ద్వారా నది బేసిన్‌ బయటికి నీళ్లు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇలాగైతే... తాము కూడా జూరాల దిగువలో భారీ బ్యారేజిని నిర్మించి, రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్టు చేస్తామని అన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న షెకావత్‌.. న్యాయం, నిబంధనలు రెండు రాష్ట్రాలకూ సమానమేనని, చట్ట ప్రకారమే అన్నీ జరగాలని పేర్కొన్నట్లు తెలిసింది.

Updated Date - 2020-10-07T14:38:25+05:30 IST