తెలంగాణ లో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు- సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2020-12-08T02:03:56+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో 8లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 8లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. రూ. 4,800 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఆమోదించారు. రైతులకు 50శాతం సబ్సిడీ ఇచ్చి ఆయిల్పామ్ సాగు చేయించనున్నట్టు సీఎం వెల్లడించారు. నిత్యం సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లోనే ఆయిల్పామ్ సాగు చేయడం సాధ్యమవుతుందని , తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా వల్ల ఆ సదుపాయం రాష్ట్ర రైతాంగం ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని 25 జిల్లాలను ఆయిల్పామ్ సాగుకు అనువైనవిగా నేషనల్ రీ అసెస్మెంట్ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిందని సీఎం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచే విధానం పై ప్రగతి భవన్లో సీఎం సమీక్ష జరిపారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, కార్యదర్శి జనార్ధన్రెడ్డి, హార్టికల్చర్ కార్పొరేషన్ ఎండి వెంకట్రామిరెడ్డి, సీడ్ కార్పొరేషన్ ఎండి కేశవులు పాల్గొన్నారు.