గ్రామ స్థాయిలోనే ధాన్యం కొనుగోలు చేయాలి- కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-10-07T22:11:18+05:30 IST

గ్రామ స్థాయిలోనే ధాన్యం కొనుగోలు చేయాలి- కేసీఆర్‌

గ్రామ స్థాయిలోనే ధాన్యం కొనుగోలు చేయాలి- కేసీఆర్‌

హైదరాబాద్‌: రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్తిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు స్పష్టం చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోనందున రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రభుత్వ ఏజెన్సీలను గ్రామాలకు పంపి మొత్తం ధాన్యాన్ని కొనుగోలుచేయిస్తామని తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్ల అంశంపై బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా సమయంలో పూర్తిస్థాయిలో కొనుగోళ్లుచేసిన విధంగానే ఈసారి కూడా ఏజెన్సీలు రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలుచేస్తాయని, మార్కెట్‌లకు ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడొద్దని సీఎం సూచించారు. 17శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని ఎండబెట్టి పొల్లు, తాలులేకుండా తీసుకొస్తే ఏ- గ్రేడ్‌ రకానికి క్వింటాల్‌కు రూ.1,888, బి- గ్రేడ్‌ రకానికి క్వింటాల్‌కు 1,868 కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్లుందని సీఎం చెప్పారు. గ్రామాల్లో వరికోతల కార్యక్రమంలో నెలా పదిహేను రోజుల పాటు సాగుతుందని, కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవసాయ, మార్కెటింగ్‌, పౌర సరఫరాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


మొత్తం ఎంత ధాన్యం వచ్చే అవకాశం ఉంటుందనే అంశం పై పక్కాగా అంచనా వేయాలని, కోనుగోళ్ల కోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సాగునీటి సౌకర్యం క్ర మంగా పెరుగుతుండడంతో పడావుపడ్డ భూములు కూడా బాగవుతూ సాగులోకి వస్తున్నాయన్నారు. రైతు బంధు పథకం కింద ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందిస్తుండడంతో పట్టణాలకు వలస వెళ్లిన రైతులు కూడా గ్రామాలకు తిరిగి వచ్చి భూములను సాగు చేసుకోవడం సంతోషకరమని సీఎం చెప్పారు. బ్యాంకు గ్యారంటీలు సహా రైతుల ధాన్యం  అమ్మకం డబ్బు  వెంటనే చెల్లించే విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.


తెలంగాణ గొప్ప వ్యసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్న నేపధ్యంలో పౌర సరఫరాలశాఖ ఇంకా విస్తృతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్ధేశిత పంటలు వేయాలని ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు 10.78 లక్షల ఎకరాల్లో కంది పంటను సాగుచేయడం అభినందనీయమన్నారు. ఆ పంటను కూడా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. 


సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, మహమూఽద్‌అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగరావు, సెక్రటరీ స్మితాసబర్వాల్‌, ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-07T22:11:18+05:30 IST