నాణ్యమైన పత్తికి తెలంగాణ ప్రసిద్ధి- కేసీఆర్
ABN , First Publish Date - 2020-12-08T01:40:02+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తి దేశంలో కెల్లా అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వెల్లడించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తి దేశంలో కెల్లా అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వెల్లడించారు. తెలంగాణలో పండే పత్తి స్టేపుల్ (దూదిపింజం) పొడవు దేశలో కెల్లా అత్యంత పొడవుగా వస్తుందని , గట్టితనం కూడా ఎక్కువని సీఎం అన్నారు. అత్యంత నాణ్యతతో కూడిన తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేందుకు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని ప్రచారం చేయడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని కోరారు. దీని కోసం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిపుణులతో ఓ సదస్సు నిర్వహించాలని సీఎం చెప్పారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా మరింత డిమాండ్ రావడానికి అనుగుణంగా పత్తి ఏరిన తర్వాత శుద్ధి చేయడం, ప్యాక్చేయడం లాంటి పనులను జాగ్రత్తగా నిర్వహించే విషయంలో రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని సీఎం కోరారు.
పత్తిలో ఏమాత్రం చెత్తాచెదారం, మట్టి పెళ్లలు, దుమ్ముచేరకుండా చూడాలని చెప్పారు. ‘ దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పత్తిసాగు అవుతున్నది. పత్తికి దేశౠయంగా , అంతర్జాతీయంగా మంచి మార్కెట్ వుంది. తెలంగాణ పత్తి పింజ పొడవు ఎక్కువ కాబట్టి మరింత డిమాండ్ ఉంది. ఇరిగేటెడ్ వాటర్ (సాగునీరు) ద్వారా సాగుచేసే భూముల్లో పంట మరింత బాగా వస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎక్కువ కట్టుకున్నందున సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కాబట్టి కాల్వల కింద పత్తిని సాగుచేస్తే మరింత లాభసాటిగా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు. పత్తికి మించి మార్కెట్ రావడానికి ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.