అశ్రునయనాల నడుమ చంద్రమౌళి అంత్యక్రియలు
ABN , First Publish Date - 2020-12-12T04:22:30+05:30 IST
అశ్రునయనాల నడుమ చంద్రమౌళి అంత్యక్రియలు
మహబూబాబాద్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): గార్ల మండల కేంద్రంలో ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ ఎడమ చంద్రమౌళి అంత్యక్రియలు బంధుమిత్రుల అశ్రునయనాల నడుమ జరిగాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, జర్నలిస్టులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. గురువారం సాయంత్రం గుండెపోటుతో సీనియర్ రిపోర్టర్ చంద్రమౌళి కన్నుమూయగా శుక్రవారం పాకాల ఏటి వద్ద వైకుంఠదామంలో అంత్యక్రియలను నిర్వహించారు. దారి పొడవునా చంద్రమౌళి అమర్హై అంటూ కన్నీటి పర్యంతమయ్యా రు. చంద్రమౌళి తనయుడు సందీప్ చితికి నిప్పటించగా కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. కాగా,చంద్రమౌళి మృతి వార్త తెలుసుకున్న జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు, గార్ల జడ్పీటీసీ ఝూన్సీ, ఎంపీపీ మూడ్ శివాజీ చౌహన్, సర్పంచ్ బన్సీలాల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, వైస్ ఎంపీపీ కట్టెబోయిన శ్రీనివాస్, సీపీఎం నాయకులు కందూనూరి శ్రీనివాస్, గిరిప్రసాద్, న్యూడెమోక్రసీ నాయకులు గౌని ఐలయ్య, జడ సత్యనారాయణ, సకృ, పీడీఎ్సయూ నాయకుడు మధు, ఐజేయూ అనుబంధ టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్, బయ్యారం సీఐ తిరుపతి, గార్ల ఎస్సై రవి, ప్రజాసంఘాల నాయకులు, జర్నలిస్టులు గార్లకు చేరుకుని చంద్రమౌళి మృతదేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం సీపీఐ, సీపీఎం, ఎన్డీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. పేద ప్రజల కోసం రిపోర్టర్ చంద్రమౌళి చేసిన కృషిని పలువురు కొనియాడారు. నిరుపేదల పక్షాన నిలుస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేశారని చెప్పారు.