విప్లవ నేత ‘చల్లపల్లి’ మృతి
ABN , First Publish Date - 2020-08-27T09:13:51+05:30 IST
ఉద్యమమే ఆయన ఊపిరి. రైతు కూలీలే ప్రాణంగా ఎన్నో ఉద్యమాలకు ప్రాణం పోసిన ప్రజా పోరాట యోధుడు చల్లపల్లి శ్రీనివాసరావు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు 94 ఏళ్ల ‘చల్లపల్లి’..
కోడూరు, ఆగస్టు 26: ఉద్యమమే ఆయన ఊపిరి. రైతు కూలీలే ప్రాణంగా ఎన్నో ఉద్యమాలకు ప్రాణం పోసిన ప్రజా పోరాట యోధుడు చల్లపల్లి శ్రీనివాసరావు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు 94 ఏళ్ల ‘చల్లపల్లి’.. కృష్ణా జిల్లా కోడూరు మండలం దింటిమెరకలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పేదలకు బంజర భూములు పంచాలంటూ ప్రభుత్వంపై ఎడతెరిపిలేని పోరాటాలు చేసిన చరిత్ర ఆయనది. విప్లవకారుడిగా చివరికంటా తన ఆశయాలకు ఆయన కట్టుబడ్డారు. దివిసీమ ప్రాంత ప్రజలకు పులిగడ్డ - పెనుమూడి వారథి, డెల్టా పరిరక్షణ వంటి లక్ష్య సాధన పోరాటాల్లో ఆయనదే తొలి అడుగు. ఉల్లిపాలెం - భవానిపురం వంతెన నిర్మాణానికి ఆయన చేసిన త్యాగాలు అజరామరం. చల్లపల్లి శ్రీనివాసరావు మృతి వార్త తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రబాబు, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సీపీఎం నాయకులు వంగల సుబ్బారావు, ఆవుల బసవయ్య ఆయన పార్థీవదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు.