అంతర్గత పరీక్షల ఆధారంగానే పదో తరగతి ఫలితాలు ప్రకటించాలి
ABN , First Publish Date - 2020-05-17T23:30:32+05:30 IST
కరోనా వైరస్ విపత్తు వల్ల విధించిన లాక్డౌన్ కారణంగా వార్షికపరీక్షలు లేకుండానే 1- 9 తరగతులను ప్రమోట్చేస్తూ జీవో.54 ద్వారా జారీ చేసిన ఉత్తర్వులను సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ అండ్ సర్వీస్(సీఈఎస్ఎస్)
![అంతర్గత పరీక్షల ఆధారంగానే పదో తరగతి ఫలితాలు ప్రకటించాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020051705563861/05172020180023n52.jpg)
హైదరాబాద్: కరోనా వైరస్ విపత్తు వల్ల విధించిన లాక్డౌన్ కారణంగా వార్షికపరీక్షలు లేకుండానే 1- 9 తరగతులను ప్రమోట్చేస్తూ జీవో.54 ద్వారా జారీ చేసిన ఉత్తర్వులను సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ అండ్ సర్వీస్(సీఈఎస్ఎస్) ఆహ్వానించింది. అలాగే అంతర్గత పరీక్షల ఆధారంగానే పదో తరగతి విద్యార్ధుల ఫలితాలు ప్రకటించాలని సెస్ ఛైర్మన్ నాగాటి నారాయణరెడ్డి, సెక్రటరీ పగడాల లక్ష్మయ్య విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి విజ్ఞప్తిచేశారు. మార్చి 19 నుంచి ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తెలుగు, హిందీ సబ్జెక్టుల తర్వాత మార్చి 22 నుంచి ఆగిపోయింది. రెండు నెలలు కావస్తోంది. ఇంకెప్పుడు పరిస్థితి చక్కబడుతుందో తెలియని పరిస్థితి. జూన్ 15 నుంచి లేదా మరో తేదీ నుంచి అయినా సామాజిక దూరాన్నిపాటిస్తూ 5.5లక్షల మంది పదో తరగతి విద్యార్దులకు ఇంకా ఎనిమిది రోజులు పరీక్షలు నిర్వహించడం చాలా కష్టంతో కూడిన పని అని వారు పేర్కొన్నారు.
దాదాపు 50వేల మంది ఇన్విజిలేటర్లు, సిబ్బంది రోజుకు మూడు గంటలకు పైగా పరీక్షా కేంద్రాల్లో ఉండాలి. లక్షల మంది తల్లిదండ్రులు విద్యార్ధులను పరీక్షా కేంద్రాలకు తీసుకు రావడం, తిరిగి ఇళ్లకు తీసుకెళ్లడం జరగాలి. తర్వాత స్పాట్ వ్యాల్యూయేషన్ చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ రవాణా అందుబాటులోకి రాకుండా హాస్టల్స్, ఆశ్రమ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్ధులు, పట్టణాల్లోని ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్ధులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేరని వారు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిలో 2019-20 విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యార్దులకు నిర్వహించిన నాలుగుఫార్మేటివ్ టెస్టులు, ఒక సమ్మేటివ్ టెస్ట్, ప్రీ ఫైనల్ ఎగ్జిమినేషన్లలో వచ్చిన మార్కుల సగటు ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. మూడు నెలల విరామం తర్వాత పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలనే ప్రయత్నం విరమించుకోవాలని వారు విజ్ఞప్తిచేశారు.