కొనుగోళ్లు ఇంకెప్పుడు..?!
ABN , First Publish Date - 2020-11-21T10:19:45+05:30 IST
సీజన్ ఆరంభం నుంచే పత్తి కొనుగోలు చేసి మద్దదు ధర చెల్లిస్తామని చెప్పిన పాలకుల మాటలు ఆచరణకు నోచుకోవడం లేదని అంటున్నారు రైతులు.

ప్రారంభం కాని సీసీఐ కేంద్రాలు
పత్తి విక్రయాల కోసం ఎదురుచూస్తున్న రైతులు
తక్కువ ధర చెల్లిస్తున్న వ్యాపారులు
కాటారం, నవంబరు 20: సీజన్ ఆరంభం నుంచే పత్తి కొనుగోలు చేసి మద్దదు ధర చెల్లిస్తామని చెప్పిన పాలకుల మాటలు ఆచరణకు నోచుకోవడం లేదని అంటున్నారు రైతులు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను రంగంలోకి దింపుతామని చెప్పి.. ఇంత వరకు దాని ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను దళారులు, వ్యాపారులు, మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటారని అంటున్నారు. కేంద్రాలను ప్రారంభించి పత్తిని కొనుగోలు చేసి మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కాటారం మండలంలోని రుద్ర, బాలాజీ జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసిన అధికారులు వాటిలో సీసీఐ కేంద్రాల ప్రారంభం దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మండలంలో పత్తి పంట సుమారు 17 వేల ఎకరాల్లో సాగైంది. సీజన్ మొదట్లో వర్షాలు పత్తి పంటకు అనుకూలంగా మారినా అనంతరం కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దీంతో పత్తి దిగుబడులపై భారీగా ఆశలు పెట్టుకున్న రైతులకు సీజన్ ఆశనిపాతంగా మారింది. దీనికితోడు తమ అవసరాల కోసం పత్తిని అమ్ముకుందామంటే వ్యాపారులు, మిల్లర్లు తక్కువ ధరలకు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు అమ్ముకుందామని ఆశపడ్డ తమకు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో నిరాశే ఎదురవుతోందంటున్నారు.
త్వరలోనే ప్రారంభిస్తాం...
సీసీఐ కేంద్రాల విషయమై కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కనకశేఖర్ని అడగ్గా మండలంలో ఉన్న రెండు పత్తి జిన్నింగ్ మిల్లులను కలెక్టర్ నోటిఫై చేశారని చెప్పారు. త్వరలో సీసీఐ అధికారులు కొనుగోళ్లను ప్రారంభిస్తారని తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్పుస్తకాలతో పత్తిని అమ్ముకోవచ్చని ఆయన తెలిపారు.