మాజీ మంత్రి దామోదరరెడ్డిపై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-08-13T07:46:17+05:30 IST
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. నియోజకవర్గంలో కాలు పెడితే చంపేస్తానంటూ దామోదర్రెడ్డి తమను బెదిరిస్తున్నారని
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఫిర్యాదు
నల్లగొండ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. నియోజకవర్గంలో కాలు పెడితే చంపేస్తానంటూ దామోదర్రెడ్డి తమను బెదిరిస్తున్నారని తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి అద్దంకి దయాకర్, పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రీతమ్ చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని బేగంబజార్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో తాము పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని దయాకర్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. దామోదరరెడ్డి అనుచరుడు వడ్డేపల్లి రవి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడంతో దయాకర్ స్వల్ప మెజారిటీతో ఓడిపోయి.. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. ఆ తర్వాత రవి టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. అయితే ఇటీవల దామోదరరెడ్డి వర్గీయులు పార్టీ సమావేశాలకు రవిని ఆహ్వానించడం, ఆయన పాల్గొనడంతో ముఠా పోరు మొదలైంది.