‘విద్య’పై వ్యాజ్యాలను ప్రోత్సహించలేం: హైకోర్టు
ABN , First Publish Date - 2020-08-15T10:08:44+05:30 IST
వాస్తవిక విషయాలు లేకుండా కేవలం విద్యావిషయక(అకడమిక్)అంశాలతో దాఖలుచేసే ..
హైదరాబాద్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): వాస్తవిక విషయాలు లేకుండా కేవలం విద్యావిషయక(అకడమిక్)అంశాలతో దాఖలుచేసే ప్రజాహిత వ్యాజ్యాలను ప్రోత్స హించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ చట్టాల్లో లోపాలు ఉంటే వాటిని సవరించాల్సిందిగా కోర్టులు పార్లమెంటును ఆదేశించజాలవని తేల్చిచెప్పింది. అత్యాచారానికి గురైన 16 ఏళ్లు నిండిన యువతి మరణించినా లేదా అపస్మారక స్థితికి చేరుకున్న పక్షంలో దోషికి ఉరిశిక్ష విధించడానికి వీల్లేదని, 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిల్ని కొట్టి వేసింది.
చట్టాల్లో లోపాలను సవరించాలని కోరుతూ పిటిషనర్ కేంద్ర న్యాయ శాఖకు విజ్ఞప్తి చేయవచ్చని ధర్మాసనం సూచించింది. అత్యాచారానికి గురైన బాలిక మరణించిన పక్షంలో ఐపీసీ 376, 302 సెక్షన్ల కింద దోషికి ఉరి శిక్ష వేసే అధికారాలు ట్రయల్ కోర్టుకు ఉంటాయని గుర్తుచేసింది. ఈ మేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఆదేశాలిచ్చింది. న్యాయవాది బి. నవప్రవల్లిక గౌడ్ ఈ పిల్ దాఖలు చేశారు.