కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం- సీఎస్
ABN , First Publish Date - 2020-04-05T22:08:33+05:30 IST
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ స్పష్టం చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ స్పష్టం చేశారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో ప్రజల్ని జాగృతం చేయడంతో పాటు తిగిన జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. ఆదివారం కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్గౌబ అన్నిరాష్ర్టాల చీఫ్ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా తెలంగాణలో కరోనా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న విషయాన్నిఆరా తీశారు. దీని పై రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకుంటున్న చర్యలను సోమేశ్కుమార్ వెల్లడించారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదైనట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాష్ట్రంలో కరోనా నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలోకి వచ్చిన విదేశీయులను గుర్తించి వారిని క్వారంటైన్కు పంపిందన్నారు. లాక్డౌన్ సందర్భంగా సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకుంటుందని సీఎస్ వెల్లడించారు. రేషన్కార్డు ఉన్న పేదలకు 12 కేజీల బియ్యం, 1500 రూపాయలను కూడా పంపిణీ చేస్తోందన్నారు. హైదరాబాద్ నగరంలో 70 సెంటర్లలో రోజుకు 6వేల మందికి ఆహార పదార్ధాలను కూడా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు సామాజిక దూరం పాటించాలన్నవిషయంపై ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2200 మందిని క్వారంటైన్కు పంపామని, మరో 27వేల మందిని హోమ్క్వారంటైన్లో ఉంచామన్నారు. ప్రత్యేక బృందాలు వారి ఇళ్లకు రోజుకు రెండుసార్లు వెళ్లి వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్కుమార్సుల్తానియా, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ యోగితారాణా, ఆర్ధికశాఖ కార్యదర్శి రోనాల్డ్రాస్, ఎక్సైజ్శాఖ కార్యదర్శి సర్ఫరాజ్అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.