సీఎం కేసీఆర్ ఇవాళ ఏం చెప్పబోతున్నారు..!?
ABN , First Publish Date - 2020-05-18T08:34:54+05:30 IST
లాక్డౌన్ పొడిగింపు, సడలింపులు, ప్రజారవాణాపై నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సమావేశం కానుంది. సీఎం అధ్యక్షతన ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్లో ఈ భేటీ

- 5గంటలకు కేబినెట్ భేటీ
- కేంద్రం మార్గదర్శకాలపై చర్చ
- ప్రజారవాణాపై కీలక నిర్ణయం
- వివరాలు వెల్లడించనున్న సీఎం
హైదరాబాద్, మే 17(ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ పొడిగింపు, సడలింపులు, ప్రజారవాణాపై నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సమావేశం కానుంది. సీఎం అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్లో ఈ భేటీ జరగనుంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కేంద్రం మార్గదర్శకాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. కేంద్రం అనుమతించిన సడలింపులన్నీ రాష్ట్రంలో అమలుచేయాలా, వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా ప్రజారవాణా పునరుద్ధరణ నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే ఇచ్చింది. దీంతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజారవాణాను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాకు వెల్లడిస్తారు. ప్రయాణికుల సంఖ్యను కుదించి, తగు జాగ్రత్తలతో దూరప్రాంతాలకు నాన్స్టాప్ బస్సులు నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం సడలింపులు ఇస్తే బస్సుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని గతంలో కేసీఆర్ పేర్కొన్నారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.