కేసీఆర్‌ది రాక్షసానందం

ABN , First Publish Date - 2020-04-28T09:48:53+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇక్కట్లను ప్రస్తావించిన తమపై విమర్శలు గుప్పించేందుకు మంత్రులను ఎగదోసి సీఎం కేసీఆర్‌ రాక్షస ఆనందం ..

కేసీఆర్‌ది రాక్షసానందం

  • మంత్రులు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు
  • రైతుల సమస్యలపై ఇంత నిర్లక్ష్యమా?: బండి సంజయ్‌
  • జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ తమిళిసైకి వినతి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇక్కట్లను ప్రస్తావించిన తమపై విమర్శలు గుప్పించేందుకు మంత్రులను ఎగదోసి సీఎం కేసీఆర్‌ రాక్షస ఆనందం పొందుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. తాము చెప్పిన అంశాలను పక్కదారి పట్టిస్తూ మంత్రులు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్తే రైతుల ఇబ్బందులు తెలుస్తాయని అన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులతో కలిసి సోమవారం రాజ్‌భవన్‌కు వచ్చిన ఆయన.. క్షేత్రస్థాయి పరిస్థితులను వివరిస్తూ గవర్నర్‌ తమిళిసైకి వినతిపత్రం అందజేశారు.


రైతుల సమస్యలపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం, పలువురు రైతులు ధాన్యానికి నిప్పంటించి నిరసన తెలియజేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని గవర్నర్‌కు వివరించారు. అనంతరం సంజయ్‌ మాట్లాడుతూ చాలా కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదని, తాలు పేరిట ఇష్టా రాజ్యంగా కోతలు పెడుతున్నారని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజనూ కొంటామని కేసీఆర్‌ చెబుతుంటే, కేంద్రం ఎందుకు కొనడం లేదని మంత్రులు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు.


ధాన్యం కొనుగోలులో ఒక  విధాన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. వలస కూలీలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తమ వినతిని పరిశీలిస్తానని గవర్నర్‌ హామీ ఇచ్చారని సంజయ్‌ తెలిపారు.

Updated Date - 2020-04-28T09:48:53+05:30 IST