చెల్లిలిని ప్రేమిస్తున్నాడని ఓ అన్న దారుణం.. బైక్పై వెళ్తున్న యువకుడిని..
ABN , First Publish Date - 2020-05-23T17:43:26+05:30 IST
తన చెల్లెలిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో అన్న ఓ యువకుడిని హత్య చేశాడు. ఈ ఘటన బచ్చన్నపేట మండలం కొడువటూరు కమాన్ వద్ద శుక్రవారం జరిగింది. కొన్నెకు చెందిన పేర్ని కొమురమ్మ-తిరుపతి దంపతులకు ముగ్గురు కుమారులు.
యువకుడి దారుణహత్య
చెల్లిలిని ప్రేమిస్తున్నాడని అన్న దురాఘతం
కొడువటూరు కమాన్ వద్ద ఘటన
బచ్చన్నపేట(వరంగల్): తన చెల్లెలిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో అన్న ఓ యువకుడిని హత్య చేశాడు. ఈ ఘటన బచ్చన్నపేట మండలం కొడువటూరు కమాన్ వద్ద శుక్రవారం జరిగింది. కొన్నెకు చెందిన పేర్ని కొమురమ్మ-తిరుపతి దంపతులకు ముగ్గురు కుమారులు. తిరుపతి దంపతులు ఉపాధి కోసం ముంబాయికి వెళ్లటంతో రెండో కుమారుడు శ్రీధర్ (22) అమ్మమ్మ ఊరైన కొడవటూరులో కరికె సిద్ధయ్య-బాలమ్మ దంపతుల వద్ద ఉండి టెన్త్ వరకు చదువుకున్నాడు. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన యువతి పరిచయం అయింది. ఈమే ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో నర్సుగా కొలువు చేస్తుండగా, శ్రీధర్ కూడా అక్కడే ఓ హోటల్లో పని చేస్తున్నాడు.
లాక్డౌన్తో కొడవటూరుకు వారిద్దరూ రావడంతో ప్రేమవ్యవహారం ఆ యువతి కుటుంబసభ్యులకు నచ్చలేదు. వేరువేరు కులాలు కావడంతో పెద్దమనుషులు నచ్చచెప్పేప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఇటీవల యువతికి వివాహం నిశ్చయం కాగా, అబ్బాయి తరుపువారికి ఎవరో ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషయాలు అందించినట్లు సమాచారం. కాగా, ఈ పెళ్లి చెడకొట్టేందుకు శ్రీధరే ఇలాచేసి ఉంటాడనే అనుమానంతో యువతి కుటుంబసభ్యులు కక్ష పెంచుకున్నారు. దీంతో యువతి అన్న మినలాపురం శివకుమార్ శుక్రవారం ఉదయం ట్రాలీ ఆటోలో బచ్చన్నపేట వైపు వెళ్తుండగా, కొడవటూరు కమాన్ సమీపంలో ఎదురుగా ద్విచక్ర వాహనంపై శ్రీధర్ రావటాన్ని గమనించి, ఢీ కొట్టాడు.
ఆ బైక్ పైనుంచి పడిపోవటంతో కత్తితో శ్రీధర్ కడుపులో పొడవగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు ధ్రువీకరించారు. మృతి కారణమైన శివకుమార్ పోలీసులకు లొంగిపోయినట్టు తెలిసింది. ఘటనా స్థలాన్ని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఎసీపీ వినోద్కుమార్, జనగామ, నర్మెట సీఐలు మల్లేశ్, సంతోష్, ఎస్ఐలు చేరుకుని పరిశీలించా రు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రఘుపతి తెలిపారు. కాగా, కొడవటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొ ని ఉన్న దృష్ట్యా పోలీసులు 144 సెక్షన్ అమలు పరుస్తున్నారు.