టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేత రావుల శ్రీధర్ రెడ్డి
ABN , First Publish Date - 2020-11-02T18:49:54+05:30 IST
రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రచ్చన్న యుద్ధం నడుస్తోంది. ఈ యుధ్ధానికి దుబ్బాక ఉప ఎన్నిక వేదికైంది. దుబ్బాక నియోజకవర్గానికి మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి.
హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రచ్చన్న యుద్ధం నడుస్తోంది. ఈ యుధ్ధానికి దుబ్బాక ఉప ఎన్నిక వేదికైంది. దుబ్బాక నియోజకవర్గానికి మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. దుబ్బాకలో విజయంపై రెండు పార్టీలు ధీమాతో ఉన్నాయి. అయితే బీజేపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ వ్యూహాన్ని రచించింది. బీజేపీ రాష్ట్ర నాయకుడిని టీఆర్ఎస్లో చేర్చుకుని ఆ పార్టీకి షాకిచ్చింది. బీజేపీ నేత రావుల శ్రీధర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో శ్రీధర్ రెడ్డి పార్టీలో చేరారు. రావుల శ్రీధర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాజీనామా లేఖను బీజేపీ అధిష్టానానికి పంపారు. బీజేపీలో తాను 11 సంవత్సరాలుగా ఉన్నానని, తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ తరఫున శ్రీధర్రెడ్డి గొంతును వినిపిస్తుండేవారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. నిన్న మొన్నటి వరకూ దుబ్బాక ఉప ఎన్నికపై శ్రీదర్ మాట్లాడారు. టీవీ డిబెట్స్, మీడియా మీట్లు పెట్టి మరీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరుపై మండిపడ్డారు. అంతేకాకుండా దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు డబ్బుల వ్యవహారంపై కూడా ఇటీవలే స్పందించి అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే సడన్గా ఇలా పార్టీకి రాజీనామా చేయడంపై రాష్ట్ర బీజేపీ నేతలు ఒకింత షాక్కు గురయ్యారు.