సామాజిక విభజనకు బీజేపీ కుట్ర: బృందాకరత్
ABN , First Publish Date - 2020-09-18T10:17:13+05:30 IST
భూమి, భుక్తి కోసం.. వెట్టిచాకిరి, పీడన నుంచి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటాన్ని బీజేపీ, ఆరెస్సెస్ వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని సీపీఎం పోలిట్

భూమి, భుక్తి కోసం.. వెట్టిచాకిరి, పీడన నుంచి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటాన్ని బీజేపీ, ఆరెస్సెస్ వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ విమర్శించారు. హిందూ, ముస్లింల మధ్య ఘర్షణగా దాన్ని చిత్రీకరించేందుకు అవి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి అంశాలను నిశితంగా పరిశీలించి, ప్రజలకు విడమరిచి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు టీ.జ్యోతి అధ్యక్షత ఆన్లైన్లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో బృందాకారత్ పాల్గొన్నారు.
సాయుధ పోరాట కాలంలో భూమిపై పెత్తందారుల ఆధిపత్యం ఉంటే.. నేడు పెట్టుబడిదారుల గుత్తాధిపత్యం కొనసాగుతోందని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. తన పరిపాలనా వైఫల్యాలను సవరించుకోవాలని సూచించారు. కాగా, సాయుధ పోరాటాన్ని నడిపింది కమ్యూనిస్టులైతే.. ఒక్క శాతం పాత్ర కూడా లేని బీజేపీ, ఆర్ఎ్సఎ్సలు చరిత్రను వక్రీకరించేందుకు చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలని సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.