ఓట్ల లెక్కింపు సమయంలో జాగ్రత్త!
ABN , First Publish Date - 2020-12-03T07:37:25+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ ఇన్చార్జిలను

కౌంటింగ్ ఏజెంట్లను అప్రమత్తం చేయండి
టీఆర్ఎస్ గ్రేటర్ ఇన్చార్జిలతో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ ఇన్చార్జిలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని నిర్దేశించారు. బుధవారం ఇక్కడ తన క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ ఇన్చార్జిలతో ఆయన సమావేశమయ్యారు. కౌంటింగ్కు సంబంధించి పార్టీ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు.
చాలా ఏళ్ల తర్వాత గ్రేటర్ ఎన్నికల పోలింగ్లో బ్యాలెట్ పేపర్ వినియోగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది పార్టీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్లకు కొత్త అని, వారితో స్వయంగా మాట్లాడి, అనుమానాలు ఉంటే నివృత్తి చేయాలని చెప్పారు. బ్యాలెట్ పేపర్ల లెక్కింపు సమయంలో గమనించాల్సిన అంశాలను తెలియజేయాలని నిర్దేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లో పార్టీ ఏజెంట్లు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండేలా చూడాలని, కౌంటింగ్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.