తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వండి: భట్టి
ABN , First Publish Date - 2020-05-18T08:53:43+05:30 IST
లాక్డౌన్తో నష్టపోయిన నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. సీఎం కేసీఆర్ మద్యం అమ్మకాల్లోనే నిమగ్నమయ్యారని ఆరోపించారు

ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్: లాక్డౌన్తో నష్టపోయిన నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. సీఎం కేసీఆర్ మద్యం అమ్మకాల్లోనే నిమగ్నమయ్యారని ఆరోపించారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ స్పందించి తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రేషన్కార్డు ఉన్న కుటుంబాలకు నెలకు రూ.7500 ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. కాగా, వలస కార్మికుల పట్ల నిర్లక్ష్యానికి నిరసనగా ఆదివారం గాంధీభవన్లో వీహెచ్ దీక్ష చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు దీక్షలో పాల్గొన్నారు. వలస కార్మికులను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిరవధిక దీక్ష చేస్తానని వి.హన్మంతరావు స్పష్టం చేశారు. బత్తాయి రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో బత్తాయి తోటలను ఆయన పరిశీలించారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ సీఎం జగన్ అక్రమంగా నీళ్లు తీసుకెళ్తున్నా సీఎం కేసీఆర్ నోరు ఎందుకు మెదపడం లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డిలో ప్రశ్నించారు.