అఖిలపక్ష సమావేశంలో పాల్గొనండి
ABN , First Publish Date - 2020-06-19T09:32:59+05:30 IST
చైనా ఆర్మీ దాడిలో భారత కల్నల్ సహా 20 మంది సైనికుల వీర మరణం, తర్వాత జరిగిన పరిణామాలపై సమగ్ర సమాచారాన్ని పంచుకునేందుకు
- సీఎం కేసీఆర్కు రాజ్నాథ్ ఫోన్
హైదరాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): చైనా ఆర్మీ దాడిలో భారత కల్నల్ సహా 20 మంది సైనికుల వీర మరణం, తర్వాత జరిగిన పరిణామాలపై సమగ్ర సమాచారాన్ని పంచుకునేందుకు శుక్రవారం ప్రధాని మోదీ నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్కు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం ఫోన్ చేశారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడాల్సిన, రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యల విషయమై బుధవారం ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా.. భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. చైనా, మరే దేశమైనా భారత్ అంతర్గత విషయంలో వేలు పెడితే ప్రతిఘటించాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించనున్న అఖిల పక్ష సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు.