దుబ్బాక విజయంలో ‘సహ’యం
ABN , First Publish Date - 2020-11-19T09:05:19+05:30 IST
దుబ్బాకలో భారతీయ జనతా పార్టీకి విజయం ఎలా సాధ్యమైంది..? దీనిపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. ఉప
700కు పైగా ఆర్టీఐ దరఖాస్తులు సమర్పించిన బీజేపీ అభ్యర్థి ..
ఈ సమాచారమే రఘునందన్ రావు బ్రహ్మాస్త్రం
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): దుబ్బాకలో భారతీయ జనతా పార్టీకి విజయం ఎలా సాధ్యమైంది..? దీనిపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. ఉప ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం వెనుక ‘సమాచార హక్కు చట్టం’ కీలక పాత్ర పోషించింది. సామాన్యుల చేతిలో అస్త్రంగా పేరొందిన ఈ చట్టాన్ని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి విజయాన్ని సాధించారు. స్థానిక సంస్థలకు నిధుల కొరత లేదని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవానికి గ్రామ పంచాయతీలుకు కేటాయించిన నిధులెన్ని ?
దుబ్బాక నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాలు ఎవరికి అందుతున్నాయి ? అభివృద్ధి పనులకు కేటాయించిన కోట్లాది నిధులు ఎలా దుర్వినియోగమయ్యాయి ? ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికమంత్రి హరీష్ రావు తమ నియోజకవర్గాలకు కేటాయించింది ఎంత ? దుబ్బాక నియోజకవర్గానికి అందించిన నిధులెన్ని ? ఈ వివరాలను ‘సమాచార హక్కు చట్టం’ ద్వారా సేకరించిన రఘునందన్ రావు.. వాటిని ప్రజల ముందుంచారు. ఈ వివరాలను మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ చేరవేశారు.
ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారమిదీ..
దుబ్బాకలో ఒక మున్సిపాలిటీ, 7 మండలాలు, 118 గ్రామ పంచాయతీలుండగా వీటి పరిధిలోని 50 ప్రభుత్వ శాఖల్లో సమాచారం కోసం 700కుపైగా దరఖాస్తులు సమర్పించి సమాచారాన్ని పొందారు.
స్థానిక సంస్థలకు కేంద్రం నిధులివ్వడం లేదని టీఆర్ఎస్ నేతలు ప్రచారంలో ఆరోపించగా.. గత ఆరేళ్లలో కేంద్రం విడుదల చేసిన నిధులను పంచాయతీలవారీగా సేకరించి ప్రజల ముందుంచారు.
దుబ్బాక మునిసిపాలిటీ టౌన్హాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 3 కోట్లు విడుదల చేయగా.. కేవలం పునాది వేసి వదిలేసినా సంబంధిత కాంట్రాక్టర్కు నిధులన్నీ విడుదలచేశారు.
డంపింగ్ యార్డుకు రూ.2 కోట్లు కేటాయించగా కనీసం పునాదులకు ముగ్గు కూడా పోయకుండానే నిధులన్నీ విడుదల చేసేశారు.
పల్లెప్రగతి కింద ప్రతినెలా గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. దుబ్బాకలోని 118 గ్రామ పంచాయతీల్లో అసలు నిధులే విడుదల చేయలేదన్న విషయాన్ని సేకరించారు.
సీఎం నియోజకవర్గం గజ్వేల్కు స్పెషల్ డెవల్పమెంట్ ఫండ్ కింద గత ఆరేళ్లలో రూ. 420 కోట్లు కేటాయించగా.. సిద్దిపేట నియోజకవర్గానికి రూ. 180 కోట్లు ఇచ్చారు. దుబ్బాకకు కేటాయించింది రూ.10 కోట్లే. ఈవిషయాన్ని ప్రచారంలో బీజేపీ విస్తృతంగా ఉపయోగించింది.