‘ప్రకృతి వైపరీత్య’ ప్రకటన కోసం కేంద్రాన్ని కోరండి
ABN , First Publish Date - 2020-10-21T10:04:59+05:30 IST
భారీ వర్షాలు, వరదల విపత్తును ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్
ప్రకృతి బీభత్సం కేంద్రానికి పట్టదా?: తమ్మినేని
హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదల విపత్తును ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ వసతులు కల్పిస్తూ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని.. చెరువులు, నాలాల దురాక్రమణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. ‘కుండపోత వర్షమని కలగన్నామా..?’ అన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై నారాయణ స్పందించారు. నాలాల పునరుద్ధరణ, తదితర పనులకు కిర్లోస్కర్, బయాన్స్, జేఎన్టీయూ కమిటీలు ఇచ్చిన నివేదికలపై ఆరేళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వరదలతో జన జీవనం అతలాకుతలమవుతుంటే కేంద్రానికి పట్టదా..? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. తక్షణం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి రైతులు, వరద బాధితులను ఆదుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కిషన్రెడ్డి ఓదార్పు యాత్ర తప్ప.. కేంద్రం నుంచి నేటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం దిగ్ర్భాంతి కలిగిస్తోందని ఆయన అన్నారు.