నిత్యావసర వస్తువులను.. అధిక ధరలకు విక్రయిస్తే బేడీలే..!
ABN , First Publish Date - 2020-03-23T09:59:39+05:30 IST
నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే అరెస్టులు తప్పవని అధికారులు హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన

డయల్-100కు ఫిర్యాదు చేయొచ్చు
హైదరాబాద్ సిటీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే అరెస్టులు తప్పవని అధికారులు హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి, ధరలు పెంచే ప్రమాదముంది. స్వయానా సీఎం కేసీఆర్ సైతం ధరలను పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆదివారం నాటి జనతా కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం కొందరు వ్యాపారులు పాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెంచినట్లు అధికారులు గుర్తించారు.
ఈ నెల 31 వరకు లాక్డౌన్ నేపథ్యంలో ఎవరైనా వ్యాపారులు అధిక ధరలకు విక్రయాలు జరిపితే నిత్యావసర వస్తువుల చట్టం, ఐపీసీ, ఇతర చట్టాల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఎమ్మార్పీని మించి నిత్యావసరాలను విక్రయిస్తే.. డయల్-100కు ఫోన్చేసి, ఫిర్యాదు చేయాలని సూచించారు.