ధర్మాధికారి నివేదికకు ఆమోదం

ABN , First Publish Date - 2020-12-19T07:31:02+05:30 IST

విద్యుత్తు ఉద్యోగుల విభజనలో జస్టిస్‌ డీఎం ధర్మాధికారి నివేదికను అమలు చే యాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్రాన్స్‌కో, జెన్‌కోలు కదిలాయి.

ధర్మాధికారి నివేదికకు ఆమోదం

ట్రాన్స్‌కో, జెన్‌కోలో ఉద్యోగులను చేర్చుకుంటూ నిర్ణయం

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు ఉద్యోగుల విభజనలో జస్టిస్‌ డీఎం ధర్మాధికారి నివేదికను అమలు చే యాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్రాన్స్‌కో, జెన్‌కోలు కదిలాయి. ఈ మేరకు ఆ నివేదికను అమలు చేస్తూ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. తాజా నివేదిక ప్రకారం తెలంగాణ ట్రాన్స్‌కోలో 134 మంది ఉద్యోగులతో పాటు 38 మంది పెన్షనర్లను, జెన్‌కోలో 252 మంది ఉద్యోగులతో పాటు 48 మంది పెన్షనర్లను చేర్చుకున్నారు. ఇక 134 మందిని తెలంగాణ ట్రాన్స్‌కో నుంచి ఏపీ ట్రాన్స్‌కోకు పంపిస్తూ.... అదే సంఖ్యలో 134 మందిని ఏపీ నుంచి తెలంగాణ ట్రాన్స్‌కోలో చేర్చుకున్నారు. వీరేకాక మరో 39 మంది పదవీ విరమణ చేసిన వారిని చేర్చుకున్నారు.


తెలంగాణ జెన్‌కోలో 252 మందితో పాటు 48 మంది పెన్షనర్లను చేర్చుకున్నారు. వీరికి డిసెంబరు నెల నుంచి వేతనాలు/పెన్షన్లు/సర్వీస్‌ పెన్షన్లు అందించాలని నిర్దేశిస్తూ ఉత్తర్వులిచ్చారు.  2014 జూన్‌ 2 నాటికీ కేడర్‌ ఆధారంగా వీరికి సీనియారిటీని నిర్ధారించనున్నట్లుపేర్కొన్నారు. ఇక మూడు విద్యుత్తు సంస్థల్లో 107 మంది ఉద్యోగుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు.

తొలి దశలో తెలంగాణకు వస్తామని ఆప్షన్లు ఇచ్చి... తెలంగాణలోనే వేతనాలు తీసుకుంటున్న 48 మంది జెన్‌కో, 39 మంది ట్రాన్స్‌కో, ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి ఇక్కడే వేతనాలు తీసుకుంటున్న 20 మంది ఉద్యోగుల విషయంలో విద్యుత్తు సంస్థలు ఉత్తర్వులే వెలువ రించలేదు. దాంతో వీరంతా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. 


Updated Date - 2020-12-19T07:31:02+05:30 IST