ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు లేనట్లే
ABN , First Publish Date - 2020-06-25T15:41:24+05:30 IST
ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు లేనట్లే
![ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు లేనట్లే](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు నడిచే అంశంపై సందిగ్ధత నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమవగా...రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం, టీఎస్ఆర్టీసీలో ఆపరేషన్స్ విభాగంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్ తేలడంతో చర్చల్ని వాయిదా వేసింది. దీంతో ఇప్పట్లో ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నెల 17న విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు నిర్వహించారు. తాజాగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు వాయిదా పడటంతో బస్సు సర్వీసులను నడిపే అంశంపై సందిగ్ధత నెలకొంది. కాగా ఈ నెల 1 నుంచి 20 వరకు ఏపీఎస్ఆర్టీసీ రోజుకు సగటున 3,266 బస్సు సర్వీసుల్ని నడిపింది. 11.03 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయి. గత 20 రోజులుగా రోజుకు రూ.2.43 కోట్లు ఆదాయం ఆర్టీసీ ఆర్జించింది. కిలోమీటరుకు రూ.22.06 మాత్రమే పొందింది. కరోనాకు ముందు రోజుకు రూ.12 కోట్ల ఆదాయం ఆర్టీసీకి వచ్చేది. త్వరలో సిటీ సర్వీసులు ఏపీఎస్ఆర్టీసీ త్వరలో సిటీ సర్వీసులు ప్రారంభించేందుకు నిర్ణయించింది. విజయవాడ, విశాఖలో నడిపే సిటీ సర్వీసుల్లో ఎక్కడ్నుంచి ఎక్కడకు వెళ్లినా ఒకే రేటు వసూలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.