రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక
ABN , First Publish Date - 2020-12-03T07:51:02+05:30 IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో రాష్ట్రంలో మరో ఉపఎన్నిక అనివార్యమైంది. నియోజకవర్గ

నోముల మృతితో సాగర్ సీటు ఖాళీ
టీఆర్ఎస్, కాంగ్రె్సలకు మరో పరీక్ష
అక్కడ బీజేపీ బలం నామమాత్రమే!
నల్లగొండ/హైదరాబాద్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో రాష్ట్రంలో మరో ఉపఎన్నిక అనివార్యమైంది. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఏర్పడిన నాగార్జునసాగర్ స్థానానికి తొలిసారి 2009లో ఎన్నికలు జరిగా యి. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ నేత జానారెడ్డి గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీపీఎం నుంచి టీఆర్ఎ్సలో చేరిన నోముల నర్సింహయ్య 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసినా జానారెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య 7,771 ఓట్ల మెజారిటీతో విజయబావుటా ఎగురవేశారు.
అయితే.. అనారోగ్యంతో మంగళవారం నోముల చనిపోవడంతో నాగార్జునసాగర్లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇది అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీలకు మరో పరీక్ష కానుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం 6 నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. 2018 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఇప్పటికి రెండు ఉపఎన్నికలు జరిగాయి. 2019లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఎంపీగా గెలవడంతో హుజూర్నగర్లో ఉప ఎన్నిక జరిగింది. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్పద్మావతీరెడ్డిపై ఘన విజయం సాధించారు.
ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో గత నెలలో దుబ్బాకలో మరో ఉపఎన్నిక జరిగింది. ఇక్కడ హోరాహోరీగా జరిగిన పోరు లో అనూహ్యంగా బీజేపీ కైవసం చేసుకుంది. తాజాగా ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో రాష్ట్రంలో మూడో ఉప ఎన్నిక అనివార్యమైంది. మొదటి నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రె్సకు కంచుకోట. తొమ్మిది సార్లు ఈ నియోజకవర్గం(గతంలో చలకుర్తి) నుంచి జానారెడ్డి పోటీ చేయగా ఏడు సార్లు గెలుపొందారు. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా జానారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలవడం ఖాయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే ఇక్కడ రెండు, మూడు గ్రూపులు ఉన్నాయి. నర్సింహయ్య అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి ఆయన కుమారుడు భగత్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అయితే.. తేరా చిన్నపరెడ్డిని అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కంకణాల నివేదిత భర్త శ్రీధర్రెడ్డి ప్రస్తుతం ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ స్థానం నుంచి ఏ మేరకు ఓట్లు పెంచుకున్నా అది బీజేపీకి అదనపు బలం అవుతుందని చెబుతున్నారు.