గంటల తరబడి అంబులెన్స్లోనే..
ABN , First Publish Date - 2020-10-27T09:35:36+05:30 IST
పేదల కార్పొరేట్ ఆస్పత్రిగా నిమ్స్ పేరుగాంచింది. కానీ, ఆ ఆస్పత్రిలోని కొందరు వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని బాధితులు

అత్యవసర వైద్యానికీ పడిగాపులే..!
మంత్రి చెప్పినా నిరుపయోగమే..
సనత్నగర్, ఆక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పేదల కార్పొరేట్ ఆస్పత్రిగా నిమ్స్ పేరుగాంచింది. కానీ, ఆ ఆస్పత్రిలోని కొందరు వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. తాజాగా ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి వైద్యుల సూచనతో అతడిని అంబులెన్స్లో మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో నిమ్స్కు తీసుకొచ్చారు. వెంటనే వైద్యం చేయాలని అత్యవసర విభాగం వైద్యులను బాధితుడి బంధువులు వేడుకొన్నారు. అయితే మంచాల్లేవ్.. మమ్మల్నేమి చేయమంటారు? అంటూ వైద్యులు ఎదురు ప్రశ్నించారు. అసలు అంబులెన్స్ నుంచి కూడా దించలేదు. మంత్రి పేషీ నుంచి ఫోన్ చేయించుకున్నా.. సిబ్బందిలో స్పందన కరువైంది. ఈవిషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లారు. నిమ్స్ డైరెక్టర్కు చెబుదామని మీడియా ప్రతినిధులు భావించినా.. స్పందన లేదు. బాధితుడు వైద్యం కోసం రాత్రి వరకు అంబులెన్స్లో ఎదురుచూశాడు.