జంతువుల ఆరోగ్య సంరక్షణపై అప్రమత్తంగా ఉండాలి: ఇంద్రకరణ్ రెడ్డి
ABN , First Publish Date - 2020-04-07T18:40:20+05:30 IST
హైదరాబాద్: తెలంగాణలో ఉన్న పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల రక్షణకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను మంత్రి అల్లోల

హైదరాబాద్: తెలంగాణలో ఉన్న పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల రక్షణకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. అమెరికాలోని బ్రాంక్స్ జూ లో పులికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో తెలంగాణలో వన్యప్రాణుల ఆరోగ్య సంరక్షకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అటవీ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు పీసీసీఎఫ్ ఆర్. శోభతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. జూపార్క్లు, కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్లో ఉన్న జంతువులు అనారోగ్యం భారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జంతువులకు సురక్షితమైన అహారాన్ని అందించాలన్నారు. జూ లో జంతువులకు ఆహారం అందించే కీపర్లకు కరోనా పరీక్షలు చేయించాలన్నారు. జూలో జంతువులన్నింటినీ జంతు వైద్య నిపుణుల పర్యవేక్షణలో వుంచాలని చెప్పారు. జంతువులకు కరోనా సోకకుండా వైద్య, వెటర్నరీ, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్లలో సీసీ కెమెరాల ద్వారా పులుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు పీసీసీఎఫ్ ఆర్. శోభ మంత్రికి వివరించారు.
మరోవైపు వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అడవుల్లో ఏర్పాట్లు చేయాలని ఇంద్రకరణ్ అధికారులను ఆదేశించారు. సోలార్ బోర్ల ద్వారా చిన్న చిన్న గుంతలు, చెక్డ్యామ్లు, సాసర్ల పిట్స్ లో నీటిని నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.