‘కల్యాణలక్ష్మి’ అక్రమాలపై ఏసీబీ సోదాలు

ABN , First Publish Date - 2020-11-21T10:10:52+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో మీ సేవ కేంద్రంగా జరిగిన కల్యాణలక్ష్మి అక్రమాలపై ఏసీబీ అధికారులు జిల్లా వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు.

‘కల్యాణలక్ష్మి’ అక్రమాలపై ఏసీబీ సోదాలు

ఆదిలాబాద్‌ ఆర్డీవో ఆఫీసులో రికార్డులు స్వాధీనం

మరో 26 మంది నకిలీ లబ్ధిదారుల గుర్తింపు

‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో దర్యాప్తు వేగవంతం


ఆదిలాబాద్‌, నవంబరు20 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో మీ సేవ కేంద్రంగా జరిగిన కల్యాణలక్ష్మి అక్రమాలపై ఏసీబీ అధికారులు జిల్లా వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో ఇప్పటికే ఇచ్చోడ, సిరికొండ, నేరడగొండ, బోథ్‌, బజార్‌హత్నూర్‌, ఇంద్రవెల్లి మండలాల తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి కల్యాణలక్ష్మి నిధులకు సంబంధించిన వివరాలను సేకరించిన ఏసీబీ అధికారులు.. శుక్రవారం ఆదిలాబాద్‌ ఆర్డీవో కార్యాలయం నుంచి కల్యాణలక్ష్మి వివరాలను సేకరించారు. తాజాగా నేరడిగొండ మండలంలో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టగా మరో 26 మంది నకిలీ లబ్ధిదారులు కల్యాణలక్ష్మి నిధులను స్వాహా చేసినట్లు తేలింది. ఇప్పటివరకు గుడిహత్నూర్‌ మండలంలో 15, బోథ్‌ మండలంలో 9, బజార్‌హత్నూర్‌ మండలంలో 6 నకిలీ కల్యాణలక్ష్మి చెక్కులను గుర్తించారు. మూడు మండలాల్లో రూ.50 లక్షలకు పైగా నిధుల గోల్‌మాల్‌ జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మీ సేవ నిర్వాహకులు తహసీల్దార్‌, ఆర్డీవో సంతకాలనే కాకుండా బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు సంతకాలను సైతం ఫోర్జరీ చేసినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది.

Updated Date - 2020-11-21T10:10:52+05:30 IST